ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.5లు కూడా కాదు.. ఉచితంగా అన్న క్యాంటీన్‌లో భోజనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 23, 2024, 07:49 PM

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన అన్న క్యాంటీన్లు తిరిగి తెరుచుకున్నాయి. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను పునరుద్ధరించింది. ఆగస్ట్ 15న రాష్ట్రవ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఆ తర్వాత ఇటీవలే సెప్టెంబర్ నెలలో మరో 75 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఈ అన్న క్యాంటీన్ల ద్వారా నిరుపేదలు, కూలీలు, కార్మికులకు మూడు పూటలా భోజనం అందిస్తున్నారు. కేవలం ఐదు రూపాయలకే ఉదయం టిఫిన్ అందిస్తున్నారు. అలాగే ఐదు రూపాయలకే మధ్యాహ్నం సమయంలో భోజనం, రాత్రి వేళ డిన్నర్ సైతం పంపిణీ చేస్తున్నారు.


అయితే ఐదు రూపాయలు కూడా లేకుండా పూర్తి ఉచితంగా ఆహారం అందించే అన్న క్యాంటీన్ కూడా ఏర్పాటైంది. ఇందులో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే మూడు పూటలా భోజనం చేయవచ్చు. ఇదెక్కడ ఉందని ఆలోచిస్తున్నారా.. ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నియోజకవర్గంలో ఈ అన్న క్యాంటీన్ ఏర్పాటైంది. రాయచోటిలో ఈ అన్న క్యాంటీన్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ అన్న క్యాంటీన్ ద్వారా మూడు పూటలా ఉచితంగా ఆహారం అందిస్తామని మంత్రి ప్రకటించారు. ఈ అన్న క్యాంటీన్ నిర్వహణను కార్యకర్తలు, టీడీపీ నేతల సహకారంతో నడుపుతామని.. ఏడాది పాటు ఉచితంగా ఆహారం అందిస్తామని ప్రారంభోత్సవం తర్వాత ప్రకటించారు. దీంతో మంత్రి నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది.


మరోవైపు అన్నమయ్య జిల్లాలో పర్యటించిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోందని మంత్రి తెలిపారు. ఈ క్రమంలోనే దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభిస్తామన్న మంత్రి.. అదే విధంగా త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం హమీని కూడా నెరవేరుస్తామన్నారు. దీనిపై ఇప్పటికే విధి విధానాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. రాయచోటి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి మీద విజయం సాధించి.. అసెంబ్లీలోకి అడుగుపెట్టిన మండిపల్లి.. తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీ రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com