కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తోందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి పేదల పొట్ట కొట్టి అన్న క్యాంటీన్లను రద్దు చేశారని మండిపడ్డారు. అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించిన ఘనత చంద్రబాబు నాయుడిది అని చెప్పుకొచ్చారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 100 క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. కడప, ప్రొద్దుటూరులో కలిపి రేపు(గురువారం) 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు. రాజధాని నిర్మాణం ఒకటి రెండు నెలలో ప్రారంభించి, నాలుగు సంవత్సరాలలో పూర్తి చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,500 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతానికి నీళ్లు వాడుకోవడానికి వెసులుబాటు అవుతుందన్నారు.వైస్సార్సీపీ ప్రభుత్వంలో ఏదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరిపిందని ఆరోపించారు. పక్క రాష్ట్రాలకు ఇసుకను వైస్సార్సీపీ నాయకులు మాఫియాలాగా అక్రమ రవాణా చేసి, వేల కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు. ప్రైవేట్ మద్యం విధానాన్ని తీసుకునివచ్చి అన్ని బ్రాండ్లకు పరిచయం చేయబోతున్నారని తెలిపారు. మద్యం రేట్లు తగ్గించి ప్రతి పేదవాడికి అందే విధంగా తెస్తున్నారని శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు.