ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో సైబర్ క్రైమ్ పెరుగుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2024, 04:56 PM

 రాష్ట్రంలో మామూలు క్రైమ్ తగ్గుతున్నా.. సైబర్ క్రైమ్ పెరుగుతోందని డీజీపీ ద్వారకా తిరుమలరావు  తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీ జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు పెట్టాలని.. ఆ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు నాయుడు అంగీకరించారన్నారు. అపరిచిత కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అటువంటి కాల్స్ వస్తే తమకు సమాచారం ఇస్తే, వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి కేసులకు సంబంధించి ప్రతీ జిల్లాలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో కిందిస్థాయి పోలీస్ సిబ్బందికి ప్రమోషన్లు ఇస్తామని వెల్లడించారు. ఏపీలో 2017లో అత్యాధునిక ఫింగర్ ప్రింట్ ల్యాబ్ పెట్టామన్నారు. గత కొంతకాలంగా అది సరిగ్గా పనిచేయడం లేదని.. అందుకు కారణాలు తెలుసుకుని, పూర్వస్థితికి తీసుకు వస్తామని చెప్పారు. పోలీస్ వాహనాలను రుణ ప్రాతిపదికన తీసుకుంటామని... ప్రభుత్వం ఈఎంఐలు చెల్లించడానికి అంగీకరించిందని డీజీపీ తెలిపారు. ‘‘మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటూ, వారికి మెరుగైన సేవలు అందించాలనేదే మా ఉద్ధేశ్యం’’ అని స్పష్టం చేశారు. మహిళలపై లైంగిక దాడులు జరగడం అత్యంత హేయం.. దారుణమన్నారు. వృద్ధురాళ్లు, చిన్నపిల్లలపై జరగడం దారుణమని... వాటిని అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. నటి జెత్వానీ కేసులో ప్రాధమిక విచారణ అనంతరం కొందరిపై చర్యలు తీసుకున్నామన్నారు. పూర్తి విచారణ చేయడానికి సమయం పడుతుందని.. దానికి కొన్ని జాతీయ, రాష్ట్ర నిబంధనలు ఉన్నాయన్నారు. సిబ్బంది బదిలీలు, పదోన్నతులను 13 జిల్లాల ప్రాతిపదికగానే చేస్తున్నామన్నారు. ఏమైనా తప్పులు జరిగితే సరిచేసుకుంటామని చెప్పారు. పోలీస్ సిబ్బందిపై ఆరోపణలు వస్తే వెంటనే చర్యలు తీసుకోమని.. అన్ని రకాలుగా విచారణ జరిపిన తరువాత చర్యలు ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు బాగా తగ్గాయని డీజీపీ ద్వారకా తిరుమల రావు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com