విశాఖపట్నం జిల్లా, గొలుగొండ మండలంలోని కొత్తపాలెం గ్రామం వద్ద ఉమాధారమల్లీశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న శివుని విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పాక్షికంగా ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై ఆలయ ఈవో కె.దివ్యతేజ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని పాతమల్లంపేట పంచాయతీ శివారు కొత్తపాలెం గ్రామం వద్ద ప్రఖ్యాత ఉమాధారమల్వీశ్వరస్వామి ఆలయం వుంది. ఈ ప్రాంగణంలో తపస్సు చేసుకుంటున్న శివుడి రూపంలో విగ్రహాన్ని గతంలో ప్రతిష్ఠించారు. ఆలయానికి వచ్చే భక్తులు ఈ విగ్రహం వద్ద కూడా పూజలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు శివుడి విగ్రహం ముక్కు, చేతులు, తలపైఉన్న పాక్షికంగా ధ్వంసం చేశారు. మంగళవారం ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి ఈ విషయాన్ని గుర్తించి ఆలయ ఈవో దివ్యతేజకు ఫోన్కుచేసి చెప్పారు. ఆమె ధారమఠం చేరుకుని విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సున్నితమైన ఈ సంఘటనపై విచారణ చేపట్టాలని ఎస్ఐ రామారావును కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు.