కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెద్ద టెర్రరిస్టు అంటూ బీజేపీ, శివసేన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం నాడు వన్టౌన్లో కాంగ్రెస్ ధర్నాకు దిగింది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, మస్తాన్ వలీ, జేడీ శీలం, నరహరశెట్టి నరసింహారావు, కొలనుకొండ శివాజి ధర్నాలో పాల్గొన్నారు. మోడీ కేడీ, కిలాడి అంటూ నినాదాలు చేశారు. నోరు పారేసుకున్న నేతలపై అనర్హత వేటు వేయాలని ఈ సందర్భంగా షర్మిల డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాహుల్ వాస్తవాలు మాట్లాడితే తీవ్రవాదం అంటారా అని మండిపడ్డారు. ఆయన అడిగిన అంశాలపై సమాధానాలు చెప్పే ధైర్యం ఉందా అని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని.. అదే తీవ్రవాదులకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ బలయ్యారన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని.. మంటలు రేపి అందులో చలి కాచుకుంటారని దుయ్యబట్టారు.