ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్ధి ఉరేసుకుని ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2024, 01:52 PM
ఒంగోలులోని శ్రీహర్షిణి జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న వడ్డిముక్కల భావన(16) అనే విద్యార్ధి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.కాలేజీ ఆవరణలో విద్యార్ధిని ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా కలకలం రేగింది. అసలేం జరిగిందంటే..ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామానికి చెందిన వడ్డిముక్కల చిన బ్రహ్మయ్య, ధనలక్ష్మి దంపతుల చిన్న కుమార్తె భావన. వినాయక చవితి సెలవుల సందర్భంగా భావన సెప్టెంబర్‌ 4వ తేదీన ఇంటికి వెళ్లింది. తిరిగి సెప్టెంబర్16వ తేదీ మధ్యాహ్నం కాలేజీకి వచ్చింది. అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో తల్లికి ఫోన్‌ చేసి మాట్లాడింది. అనంతరం ఏం జరిగిందో ఏమో కళాశాల టెర్రస్‌పై ఉన్న షెడ్డు కప్పుకు ఉన్న ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం తెల్లవారు జామున గమనించిన విద్యార్ధులు సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం సిబ్బంది భావనను కిందకు దింపి చూడగా.. అప్పటికే బాలిక మృతి చెందింది. వెంటనే బాలిక తల్లికి ఫోన్‌ చేసి సమాచారం అందించారు. ఫీజులు కట్టాలంటూ కాలేజీ యాజమాన్యమే వేధించి తన బిడ్డను పొట్టనపెట్టుకుందని మృతురాలి తల్లి కన్నీటిపర్యంతమైంది. బాలిక తల్లి ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ సీఐ నాగరాజు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. భావన తండ్రి పదేళ్ల కిందట చనిపోవడంతో తల్లి కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను చదివించుకుంటుంది.

అయితే శ్రీహర్షిణి జూనియర్‌ కాలేజీ టీడీపీ నేత గోరంట్ల రవికుమార్‌కు చెందినది కావడంతో.. విద్యార్థిని ఆత్మహత్య విషయం బయటికి రావడంతో గోరంట్ల రవికుమార్‌తో పాటుగా కళాశాల హెచ్‌ఆర్‌ సురేశ్‌, కేర్‌ టేకర్‌ చాముండేశ్వరి అందుబాటులో లేకుండా పోయారు. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యురాలు బత్తుల పద్మావతి బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. కళాశాల చైర్మన్‌ అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల నిర్వాహణ లోపాలపై ప్రశి్నంచారు. మూడు రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com