ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా నేను కూడా అందుకు కారకుడినే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2024, 09:03 PM

విజయవాడ వరదకు కారణమైన బుడమేరు వరదపై ఒక ఛానల్, నాయకుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఆగస్టు నెలాఖరులో 30, 31 తేదీల్లో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు పడ్డాయని.. వానలకు తోడు చెరువులు, వంకలు పొంగిపొర్లయన్నారు. ఈ ప్రభావంతో వెలగలేరు రెగ్యులేటర్ దగ్గరకు భారీగా వరద నీరు చేరిందని.. వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర గేట్లపై నుంచి వరద నీరు ప్రవహించిందన్నారు. ఒకవేళ ఆ సమయంలో ఆ గేట్లు ఎత్తకపోతే విజయవాడ మొత్తం ఇంకా ముంపులోనే ఉండేదని చెప్పుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.220 కోట్లతో లైనింగ్ పనులకు శ్రీకారం చుడితే.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పూర్తిగా ఆ పనులన్నీ రద్దు చేసిందన్నారు.


అప్పట్లో లైనింగ్ పనులకి కొబ్బరికాయ కొట్టి మరీ ప్రారంభించానని.. కానీ వాటిని ఎక్కడా చేయలేదన్నారు వసంత కృష్ణ ప్రసాద్. గత ప్రభుత్వ హాయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం అంతా విధ్వంసమేనన్నారు. అసలు వాస్తవాలు బయటికి చెప్పకుండా విష ప్రచారం చేయడం దారుణమని..సంక్షేమం తప్పితే దీర్ఘకాలంగా అభివృద్ధిపై జగన్మోహన్ రెడ్డి అసలు ఫోకస్ పెట్టలేదన్నారు. కృష్ణా నదికి 11 లక్షలు వరదరావడం బుడమేరు కూడా ప్రమాద స్థాయిలో వరద రావడం వల్లే గండ్లు పడ్డాయన్నారు. ఇదంతా ప్రకృతి వైపరీత్యమేనని.. గతంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా ఉన్న తాను కూడా అందుకు కారకుడినే అన్నారు.


బుడమేరుకు సంబంధించి హెడ్ రిగ్యులేటర్‌ గేట్లు తనతో పాటూ తన అనుచరులు లిఫ్ట్ చేశారని.. అందువల్లే ముంపు ఏర్పడిందని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోందన్నారు వసంత కృష్ణ ప్రసాద్. ఆ ఛానల్, ఆ నాయకుడికి ఏమీ కనిపించడంలేదని..నాలుగు రోజులుగా గండి పూడ్చివేత పనులు జరుగుతుంటే ఇష్టమొచ్చినట్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం దారుణమని మండిపడ్డారు. తాను 2019 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నానని.. 2019లో 10 సెం.మీ. వర్షం పడితే.. వెలగలేరు హెడ్ రిగ్యులేటర్‌ వద్దకు వెళ్లానని 11 అడుగుల గేట్ టాప్‌కు నీళ్లు వచ్చాయన్నారు. అప్పుడు గేట్లు ఎత్తి నీరు విడుదల చేశామని.. ఆగస్టు నెలాఖరున రెండు రోజులు కురిసిన వానకు ఆకస్మిక వర్షానికి వరద క్రమంగా పెరిగిందన్నారు. అలాగే మైలవరం నియోజకవర్గంలో దాదాపు 25 చెరువులు తెగిపోయాయని.. ఒక్కసారిగా బుడమేరకు వరద చేరి.. హెడ్ రిగ్యులేటర్‌‌కు వరద పోటెత్తిందన్నారు. అక్కడ వీడియోలు కూడా తీశామని చెప్పారు. బుడమేరు విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. ప్రజలెవరూ నమ్మొద్దని కోరారు. నాలుగు రోజులు కష్టపడి బుడమేరు గండ్లు పూడ్చగలిగారని.. వాటి ఎత్తు కూడా పెంచితే ఇక ఎలాంటి సమస్య ఉండదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com