ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ వరదల్లో మునిగిన వాహనాలు.. ప్రభుత్వం బిగ్ రిలీఫ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 09, 2024, 09:01 PM

విజయవాడ ప్రజలు వరద నుంచి ఇప్పుడు కోలుకుంటున్నారు.. అక్కడ ఇప్పడిప్పుడే సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ వరద విజయవాడవాసులకు భారీ నష్టాన్ని మిగిల్చింది.. ఇళ్లు, షాపుల్లో వస్తువులన్నీ నీటిలో మునిగిపోయాయి. కార్లు, బైకులు, ఆటోలు, ఇలా వాహనాలు నీటమునగడంతో నగరవాసులు నష్టాల్లో కూరుకుపోయారు.. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. వరదలో మునిగిన వాహనాలకు సంబంధించిన రిపేర్లపై ఓ క్లారిటీ ఇచ్చారు.


విజయవాడ వరదల్లో మునిగిపోయి దెబ్బతిన్న వాహనాలు, ఇళ్లలో పరికరాల రిపేర్లపై కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి. ఈ రిపేర్ల ఖర్చులో కొంత ప్రభుత్వం భరించడంపై ఆలోచన చేస్తున్నామని.. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు. విజయవడలో వరద దెబ్బకు బైకులు, ఆటోలు, కార్లతో పాటూ ఇతర వాహనాలు పెద్ద సంఖ్యలో మునిగిపోయి దెబ్బ తిన్నాయని గుర్తు చేశారు. ఈ వాహనాల్లో కొన్నిటికి బీమా ఉందని.. ఆథరైజ్డ్‌ మెకానిక్కుల వద్ద రిపేర్‌ చేయిస్తేనే బీమా వస్తుందని తెలిపారు. అలాగే కొందరు యజమానులు తమకు నమ్మకం ఉన్నవారి దగ్గర రిపేర్‌ చేయించుకోవాలని భావిస్తున్నారని... బీమా లేని వాహనాల రిపేర్లు ఎలా చేయించాలో ఆలోచించాల్సి ఉందన్నారు.


ఈ బీమా అంశంపై వాహనాల కంపెనీలతో మాట్లాడుతున్నామని.. వారిని సంప్రదిస్తున్నామన్నారు చంద్రబాబు. కంపెనీల దగ్గర సీఎస్‌ఆర్ నిధులు ఉంటాయని.. వాటి కింద ఉచితంగా రిపేర్లు చేయాలని అడుగుతున్నట్లు చెప్పారు. ఒకవేళ తక్కువ ఖర్చయితే ప్రభుత్వం తరపున తామే భరిస్తామని.. మరీ ఎక్కువైతే కొంత ప్రభుత్వం.. కొంత యజమానులు భరించేలా ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. వరద ప్రాంతాల్లోని ఇళ్లలో రకరకాల ఎలక్ట్రానిక్ పరికరాలు పాడై పోయాయని గుర్తు చేశారు. వాటిని ఆయా కంపెనీలకు చెందినవారే మరమ్మతు చేయాల్సి ఉంటుందని.. స్పేర్ పార్ట్స్ వాళ్ల దగ్గరే ఉంటాయని గుర్తు చేశారు. ఆ కంపెనీలతో కూడా మాట్లాడి తక్కువ ఖర్చుతో రిపేర్లు అయ్యే ఆలోచన చేస్తున్నామన్నారు. ఇందులో కూడా వీలైతే కొంత ఖర్చు ప్రభుత్వం భరిస్తుందన్నారు.


విజయవాడలో వరద నీటలో గ్యాస్‌ స్టవ్‌లు కూడా మునిగాయని.. వాటిని కొన్న కంపెనీలే రిపేర్‌ చేయాల్సి ఉంటుందన్నారు చంద్రబాబు. వాళ్లతో కూడా మాట్లాడుతున్నామని.. ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌, కార్పెంటర్, పెయింటింగ్‌ వంటి పనులు అర్బన్‌ కంపెనీకి అప్పగిస్తామని చెప్పుకొచ్చారు. అలాగే ఈ రిపేర్లకు సంబంధించిన రేట్లు తక్కువలో ఉండేలా చూస్తామని.. వీటిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. ఈ అంశాలపై వివరంగా ఒక కరపత్రం తయారు చేసి ఇంటింటికీ పంపిస్తామని చెప్పారు. అంతేకాదు ఈ వరదలతో నష్టపోయిన చిన్న వ్యాపారాలు, షాపులు నిర్వహించేవారు, పెద్ద వ్యాపారాలు చేసేవారిని తిరిగి ఎలా గాడిలో పెట్టాలన్నదానిపై బ్యాంకర్లతో మాట్లాడుతున్నామని చెప్పారు. కేంద్రం సహాయం కూడా కోరుతున్నట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com