ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరవాడ ఫార్మా కంపెనీ ప్రమాదం.. మూడుకు చేరిన మృతుల సంఖ్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 26, 2024, 08:46 PM

అనకాపల్లి జిల్లాలో వరుసగా ఫార్మా కంపెనీల్లో జరుగుతున్నప్రమాదాలు కలవరపెడుతున్నాయి. అచ్యుతాపురం సెజ్‌‌లోని ఫార్మా కంపెనీలో ప్రమాదం తర్వాత.. పరవాడ సినర్జిన్‌ పరిశ్రమలో మరో ప్రమాదం జరిగిం. ఈ ఘటనలో మొత్తం నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ ఇప్పటకిే ఇద్దరు చనిపోగా.. తాజాగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు.విజయనగరం జిల్లాకు చెందిన కెమిస్ట్‌ సూర్యనారాయణ.. విశాఖలోని ఇండస్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున చనిపోయారు. సూర్యనారాయణ మృతదేహాన్ని కేజీహెచ్‌ మార్చురీకి తరలించారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మూడుకు చేరింది.


పరవాడ సినర్జిన్‌ యాక్టివ్‌ ఇన్‌గ్రేడియంట్స్‌ యూనిట్‌-3లో ఈ నెల 22న ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో జార్ఖండ్‌కు చెందిన లాల్‌సింగ్‌ పూరి చికిత్స పొందుతూ ఈ నెల 23న, అలాగే రొయా అంగిరియా 24న, ఇవాళ వేకువజామున సూర్యనారాయణ ప్రాణాలు కోల్పోయారు. జార్ఖండ్‌కు చెందిన ఓయబోం కొర్హకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో 17మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.. పదుల సంఖ్యలో గాయపడగా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.


మరోవైపు ఎసెన్షియా ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాద ఘటన తర్వాత ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. పరిశమ్రల్లో భద్రతపై ఫోకస్ పెట్టింది.. ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ప్రమాదాల నివారణపై ప్రత్యేక చర్యలకు సిద్ధమయ్యారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కలెక్టర్‌ నియమించిన మానిటరింగ్‌ కమిటీ సభ్యులు ఎసెన్షియా ఫార్మా కంపెనీని సందర్శించారు. అనకాపల్లి ఆర్డీవో చిన్నికృష్ణ ఆధ్వర్యంలో పరిశ్రమల డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.వి.వి.ఎస్‌. నారాయణ, ఫ్యాక్టరీల బాయిలర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వీరభద్రరావు, డీఎస్పీ కె.వి.సత్యనారాయణ తదితర అధికారులు వెళ్లారు.


ఫార్మా కంపెనీలోని సాల్వెంట్, ఇతర కెమికల్స్ డ్రమ్ములు మానిటరింగ్‌ కమిటీ పర్యవేక్షణలోనే తొలగించాలని కంపెనీ యాజమాన్యాన్ని ప్రభుత్వ అధికారులు ఆదేశించారు. అంతేకాదు కమిటీ పర్యవేక్షణ లేకుండా ఆ డ్రమ్ముల్ని ఎట్టిపరిస్థితుల్లో తొలగించే ప్రయత్నం చేయొద్దన్నారు. సాల్వెంట్, కెమికల్స్ డ్రమ్ములు తొలగించేందుకు మూడు రోజుల సమయం కావాలని కంపెనీ ప్రతినిధులు కోరగా.. ఓకే చెప్పారు. ఫార్మా కంపెనీలో ఏ డ్రమ్ములు ఎన్ని ఉన్నాయో గుర్తించారు అధికారులు. ఇటు ఈ ప్రమాదంలో గాయపడిన వారికి ఆయా ఆస్పత్రుల్లో వైద్యం కొనసాగుతోంది. అలాగే ఈ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం పరిహారానికి సంబంధించిన చెక్కులు అందజేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com