ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలకృష్ణ వ్యాఖ్యలను వక్రీకరించొద్దు.. బీజేపీ లీడర్ రిక్వెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 25, 2024, 07:36 PM

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలను వక్రీకరించవద్దని కోరుతున్నారు ఓ బీజేపీ నేత. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తనకు అంగీకారమేనని బాలకృష్ణ చెప్పారని.. ఆయన వ్యాఖ్యలను వక్రీకరించొద్దని కోరుతున్నారు. అసలు బాలయ్య ఏమన్నారనే సంగతికి వస్తే.. ఇటీవలే సొంత నియోజకవర్గంలో పర్యటించారు బాలకృష్ణ. ఆగస్ట్ 16వ తేదీన హిందూపురంలో పర్యటించి రెండుచోట్ల అన్న క్యాంటీన్లను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశం నిర్వహించగా.. హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్ మీద ఓ విలేకరి ప్రశ్నించారు. దీనిపై బదులిచ్చిన బాలకృష్ణ.. సత్యసాయి జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని ఏర్పాటు చేసే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చి్స్తానని చెప్పారు. హిందూపురం అంటే చంద్రబాబుకు అభిమానమని.. జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని చేసే విషయమై త్వరలోనే ఆయనతో మాట్లాడతానని చెప్పారు. అలాగే హిందూపురం అభివృద్ధి కోసం రూ.90 కోట్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.


అయితే ఇక్కడే చిన్న సమస్య వచ్చింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో జిల్లాల విభజన జరిగింది. ఈ క్రమంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లాను కూడా రెండుగా విభజించారు. హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని కలిపి శ్రీసత్యసాయి జిల్లాగా ఏర్పాటు చేశారు. పుట్టపర్తికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని, గుర్తింపును పరిగణనలోకి తీసుకున్న నాటి ప్రభుత్వం జిల్లాకు సత్యసాయి పేరు పెడుతూ.. జిల్లా కేంద్రంగా పుట్టపర్తిని ప్రకటించింది. అయితే హిందూపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని అప్పట్లో గట్టిగా డిమాండ్లు వినిపించాయి. ఇప్పుడు కూడా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎమ్మెల్యే బాలకృష్ణను స్థానికులు కోరుతున్నారు. వారి డిమాండ్ మేరకు శ్రీసత్యసాయి జిల్లా పేరును అలాగే ఉంచేసి.. జిల్లా కేంద్రాన్ని హిందూపురానికి మార్చే విషయమై చంద్రబాబుతో మాట్లాడుతానని బాలకృష్ణ చెప్పారు.


అయితే బాలకృష్ణ వ్యాఖ్యలతో పుట్టపర్తి వాసుల్లో ఆందోళన మొదలైంది.జిల్లా కేంద్రాన్ని పుట్టపర్తి నుంచి హిందూపురం మారుస్తారని ప్రచారాలు, పుకార్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద బీజేపీ నేత, ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలనే బాలయ్య వ్యాఖ్యలను వక్రీకరించాల్సిన అవసరం లేదని అన్నారు. హిందూపురం జిల్లా కేంద్రం కావాలని కొంతమంది కోరుకుంటున్న మాట వాస్తవమేనని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా ఉండాలని తాను కోరుకుంటున్నానన్న విష్ణువర్ధన్ రెడ్డి.. సత్యసాయి భక్తుల మనోభావాలు, అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని అన్నారు. బాలకృష్ణ సైతం ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తానని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే పుట్టపర్తిలో శాశ్వత జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com