ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రూ.50 వేల కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చిన బ్రూక్ ఫీల్డ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 21, 2024, 07:36 PM

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం పెట్టుబడుల వేట మొదలుపెట్టింది. ఇప్పటికే బీపీసీఎల్ రూ.60 వేల కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు సంకేతాలు ఇవ్వగా.. ఫాక్స్ కాన్ సైతం పెట్టుబడులకు సుముఖంగా ఉంది. తాజాగా బ్రూక్‌ఫీల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఈ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఇది అతిపెద్ద విదేశీ పెట్టుబడి అయ్యే అవకాశం ఉంది.


బ్రూక్‌ఫీల్డ్ సంస్థ ప్రతినిధులు మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. ఏపీ పునరుత్పాక విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు బ్రూక్‌ఫీల్డ్ ఆసక్తి చూపుతోందని చంద్రబాబు నాయుడు తెలిపారు. ముఖ్యంగా సౌర, పవన, రూఫ్‌టాప్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఈ సంస్థ ఆసక్తి చూపుతోందన్నారు.


బ్రూక్‌ఫీల్డ్ సంస్థ ఇండియాలో ఏర్పాటు చేసిన ‘ఎవ్రెన్’ ప్లాట్‌ఫామ్ ద్వారా 8.66 గిగావాట్ల పవన, సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం. ఏపీలో దశల వారీగా 3500 మెగావాట్ల సౌర విద్యుత్, 5500 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఎవ్రెన్ సంస్థ సుముఖంగా ఉంది. ఇందులో 3000 మెగావాట్ల ప్రాజెక్టులకు ఇప్పటికే శంకుస్థాపన చేశారు. మరో రెండేళ్లలో ఈ ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. పునరుత్పాదక విద్యుత్‌తోపాటు మాడ్యూళ్ల ఉత్పత్తి, పంప్డ్ స్టోరేజీ, గ్రీన్ అమ్మోనియా తదితర విభాగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే యోచనలో ఎవ్రెన్ ఉంది. బ్రూక్‌ఫీల్డ్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 102 బిలియన్ డాలర్ల విలువైన పునరుత్పాదక ఆస్తులు ఉన్నాయి. ఈ సంస్థ ఆస్తుల విలువ లక్ష కోట్ల డాలర్లుగా ఉంది.


2026 నాటికి 1.4 గిగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న బ్రూక్‌ఫీల్డ్.. 2027లో 828 మెగావాట్లు, ఆ తర్వాత 1.3 గిగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పవన విద్యుత్ విషయానికి వస్తే.. 2026లో 1.64 గిగావాట్లు, 2027లొ 204 మెగవాట్లు, ఆ తర్వాత 3.3 గిగావాట్ల చొప్పున ఉత్పత్తి చేయాలనే టార్గెట్‌ను నిర్ధారించుకుంది.


రాష్ట్రంలో ప్రతిపాదించిన మొత్తం ప్రణాళికాబద్ధమైన సౌర, పవన విద్యుత్ సామర్థ్యం దాదాపు 9 గిగావాట్లు. పవన విద్యుత్ సామర్థ్యంలో మొదటి ఎనిమిది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. భూమట్టానికి 120 మీటర్ల ఎత్తులో 74.9 గిగావాట్లు, నేల మట్టానికి 150 మీటర్ల ఎత్తులో 123 గిగావాట్లు. జూలై 31 నాటికి, ఏపీలో స్థాపిత పవన విద్యుత్ సామర్థ్యం 4.1 గిగావాట్లు కాగా, సౌర విద్యుత్ సామర్థ్యం 4.3 గిగావాట్ల కంటే కొంచెం ఎక్కువగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com