ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాడిపత్రిలో కార్లు, బైక్‌లు ధ్వంసం.. కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2024, 10:13 PM

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీతో తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. టీడీపీ, వైసీపీ పరస్పర దాడులతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాడిపత్రిలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఈ ఘటనల తర్వాత మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రికి దూరంగా ఉంటున్నారు. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి మంగళవారం తాడిపత్రికి వచ్చారు. కొన్ని ఫైల్స్ కోసం ఆయన తాడిపత్రికి వచ్చినట్లు తెలిసింది. ఇక కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చిన సందర్భంగా వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు దిగాయి. దీనికి టీడీపీ వర్గాలు కూడా ప్రతిస్పందించడంతో తాడిపత్రిలో ఘర్షణ వాతావరణం తలెత్తింది.


టీడీపీ శ్రేణులు పెద్దారెడ్డి అనుచరుడైన కందిగోపుల మురళి, రఫీ అనే మరో వైసీపీ కార్యకర్తపై దాడి చేశాయి. ఇల్లు, కారుపైనా దాడులు చేశారు. ఇంట్లోని ఫర్నీచర్ పగలగొట్టారు. ఈ ఘటనలో ద్విచక్రవాహనాలు, కార్లు దెబ్బతిన్నాయి. దీంతో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే సమయంలో పెద్దారెడ్డి అనుచరుడు మురళి గన్నుతో హల్ చల్ చేశారు. టీడీపీ శ్రేణులు ఆయన ఇంటి మీద దాడి చేయగా.. ఆయన తుపాకీ తీసుకుని వారిని బెదిరించారు. దీనికి సంబంధించి వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితి దిగజారకుండా టీడీపీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. అనంతరం పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి అనంతపురం పంపించారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.


మరోవైపు వైసీపీ కవ్వింపు చర్యల కారణంగానే తమ కార్యకర్తలు దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పెద్దారెడ్డి వస్తున్న విషయం తెలిసి కూడా పోలీసులు ఆపే ప్రయత్నం చేయలేదన్నారు. మురళి తుపాకీతో రెచ్చగొట్టడం వల్లనే టీడీపీ కార్యకర్తలు దీటుగా సమాధానం ఇచ్చారన్న జేసీ.. తాడిపత్రి ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మరోవైపు వ్యక్తిగత పనిమీదే తాడిపత్రికి వెళ్లానన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి.. జేసీ అక్రమాలపై పోరాటం చేస్తానన్నారు. తనకు ప్రాణహాని ఉందని మానవ హక్కుల సంస్థకు ఫిర్యాదు చేశానన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి రాజకీయాలకు అడ్డొస్తాననే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఎస్పీ అనుమతితో మరోసారి తాడిపత్రికి వెళ్తానన్న కేతిరెడ్డి.. జేసీ అక్రమాలపై పోరాటం చేస్తానన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com