ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారికి గదులు ఇవ్వరు, టీటీడీ కీలక ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2024, 07:39 PM

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. శ్రీవారి వార్షిక బ్రహోత్సవాల సమయంలో వసతి గదులకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన చేసింది. అక్టోబరు 4 నుంచి 12 వరకు జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు వచ్చే సాధారణ యాత్రికులకు మరిన్ని వసతి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో.. బ్రహ్మోత్సవాల సమయంలో దాతలకు వసతి కల్పించరని టీటీడీ తెలిపింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2024 సందర్భంగా వివిధ ట్రస్ట్‌లు, స్కీమ్‌ల దాతల కోసం వసతి బ్లాక్ చేసినట్లుతెలిపారు. అక్టోబరు 4న ధ్వజారోహణం, అక్టోబర్ 12న చక్రస్నానం జరిగే రోజుల్లో మినహా దాతలకు అందుబాటులో ఉన్న ప్రత్యేకాధికారాల ప్రకారం దర్శనానికి అనుమతిస్తారు. దాతలు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.


 తిరుమలలో ఆగస్టు 27న గోకులాష్టమి ఆస్థానం, 28న ఉట్లోత్సవం


తిరుమ‌ల‌ శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సాక్షాత్తు ద్వాపరయుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఆగస్టు 27వ తేదీన శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో రాత్రి 8 నుండి 10 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు. శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ద్వాదశారాధనం చేపడతారు.


ఆగస్టు 28న తిరుమలలో ఉట్లోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంట‌ల‌కు ఈ ఉత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో విహరిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహంతో ఉట్లను కొడుతూ స్వామివార్లకు ఆనందాన్ని చేకూర్చుతారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 28న శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిసేవలైన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.


తిరుమలలో వైభవంగా శ్రావణ పౌర్ణమి గరుడసేవ


తిరుమలలో సోమవారం రాత్రి శ్రావణ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com