ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిరిమానోత్సవం తేదీలు ఫిక్స్.. ఆ రోజే సంబరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2024, 07:22 PM

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జాతర తేదీలను ఆలయ కమిటీ ప్రకటించింది. ఉత్సవం కోసం ఉత్తరాంధ్ర జిల్లాలు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉత్సవం షెడ్యూల్‌ను ఆలయ కమిటీ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 14న తొలేళ్ల ఉత్సవం జరగనుంది. అక్టోబర్ 15న సిరిమానోత్సవం నిర్వహిస్తారు. అక్టోబర్ 22 న తెప్పోత్సవం జరుగుతుంది. అక్టోబర్ 29న ఉయ్యాల కంబాల ఉత్సవంతో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం జాతర ముగుస్తుందని ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రకటించారు.


మరోవైపు దసరా పండుగ తర్వాత వచ్చే మొదటి మంగళవారం రోజున సిరిమానోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. కొన్ని ఏళ్లుగా ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. సిరిమానోత్సవానికి కనీసం నెలరోజుల ముందే సిరిమాను చెట్టు ఎక్కుడుందనే విషయమై అమ్మవారు తెలియజేస్తారు. అక్కడికి వెళ్లి ఆ చెట్టును సేకరిస్తారు. ఆ తర్వాత వడ్రంగులు ఈ చింతచెట్టును సిరిమానుగా తయారుచేస్తారు. ఈ సిరిమానుపై కూర్చుని పూజారి ప్రజలకు, రాజ కుటుంబాలను ఆశీర్వదిస్తారు. మరోవైపు సిరిమానోత్సవంలో రథాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. సిరిమానును తయారుచేసే సమయంలోనే ఈ రథాలను కూడా తయారుచేస్తారు.


మరోవైపు సిరిమానోత్సవానికి ముందు రోజు తోలేళ్ల ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సారి అక్టోబర్ 14న తొలేళ్ల ఉత్సవం జరగనుంది. అక్టోబర్ 15న సిరిమానోత్సవం వేడుకగా జరుగుతుంది. ఉత్సవం రోజున సిరిమాను మూడు లాంతర్ల జంక్షన్ వద్ద నుంచి కోట వరకూ మూడుసార్లు తిప్పుతారు. ఈ సమయంలో రాజకుటుంబాలకు చెందిన వారు, ఇతరత్రా ప్రముఖులు కోటబురుజు దగ్గర కూర్చుని అమ్మను దర్శించుకుంటారు. ఈ ఉత్సవాన్ని చూసేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తారు. జాతర జరుగుతున్నన్ని రోజులు ఆ ప్రాంతమంతా కోలాహలంగా ఉంటుంది.


 సిరిమానోత్సవం పూర్తైన తర్వాత వచ్చే మంగళవారం తెప్పోత్సవం నిర్వహిసారు. ఆ మరుసటి మంగళవారం ఉయ్యాలకంబాల ఉత్సవం జరుగుతుంది. ఈ ఏడాది అక్టోబర్ 29న ఉయ్యాల కంబాల ఉత్సవం జరుగుతుంది. అక్కడితే ఈ ఏడాది పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలు పూర్తి అవుతాయని ఆలయ కమిటీ తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com