ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు.. మూడు దశల్లో పోలింగ్

national |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2024, 10:50 PM

రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) సోమవారం మధ్యాహ్నం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రధాని ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి.. జమ్మూ కశ్మీర్, హరియాణా అసెంబ్లీల ఎన్నికల తేదీలను ప్రకటించారు. జమ్మూ కశ్మీర్‌లో 87 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. మూడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. తొలి విడత పోలింగ్ సెప్టెంబరు 18న రెండో విడత సెప్టెంబరు 25న, మూడో విడత అక్టోబరు 1న నిర్వహించనున్నారు. అక్టోబరు 4న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. చివరిసారిగా 2014లో అక్కడ ఎన్నికలు జరిగాయి.


మొత్తం 90 శాసనసభ నియోజకవర్గాలున్న హరియాణాలో ఒకే విడతలో ఎన్నికలు జరగున్నాయి. అక్టోబరు 1న పోలింగ్ నిర్వహించి.. జమ్మూ కశ్మీర్‌తో పాటు ఫలితాలను విడుదల చేయనున్నారు. హరియాణా అసెంబ్లీకి నవంబరు 6తో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ గడువులోగా ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తోంది. హరియాణాలో మొత్తం 2 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపింది. సెప్టెంబరు 5న ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసి అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. చివరి తేదీ సెప్టెంబరు 12 కాగా.. సెప్టెంబరు 16 ఉపసంహరణకు గడువు.


కాగా, కశ్మీర్‌లో సెప్టెంబరు 30లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాదు, గత నెల కశ్మీర్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రహోదాను పునరుద్దరించి, త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఎన్నికల సంఘం జమ్మూ కశ్మీర్‌లో పర్యటించి.. భద్రత సహా ఏర్పాట్లును సమీక్షించింది.


ఇక, అమర్‌నాథ్ యాత్ర ముగిసిన మర్నాడు ఆగస్టు 20న ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో 87 లక్షల మంది ఓటర్లు ఉండగా.. వీరిలో కొత్త ఓటర్లు 3.70 లక్షల మంది. అత్యధిక సంఖ్యలో యువ ఓటర్లు ఉన్నారని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.


మార్పును కోరుకుంటోన్న కశ్మీర్ ప్రజలు.. కొత్త భవిష్యత్తును సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఇటీవల తాము ఆ రాష్ట్రంలో పర్యటించినప్పుడు.. త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరారని చెప్పారు. ‘ప్రజలు మార్పును కోరుకోవడమే కాకుండా ఆ మార్పులో భాగం కావాలని కూడా నిరూపిస్తున్నారు.. ఆశ, ప్రజాస్వామ్యం సంగ్రహావలోకనం ప్రజలు ఆలోచనను మార్చాలని కోరుకుంటున్నట్లు చూపిస్తుంది... వారు తమ విధిని తామే రాయాలనుకుంటున్నారు. ప్రజలు బుల్లెట్ల కంటే బ్యాలెట్లను ఎంచుకున్నారు...లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇది తేటతెల్లమయ్యింది.. పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు ’ అని వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com