ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2024, 08:00 PM

విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఎన్నికయ్యారు. బొత్సకు పోటీగా ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవటంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించినట్లుగా అధికారికంగా ప్రకటించారు. అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని బరిలోకి దింపలేదు. పూర్తి స్థాయిలో సంఖ్యాబలం లేకపోవటంతో పాటుగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు దూరంగా ఉండాలని కూటమి నిర్ణయించుకుంది. ఇదే సమయంలో బొత్స మీదకు పోటీగా నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి షఫీ ఉల్లా కూడా తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీగా బొత్స ఎన్నిక ఏకీగ్రీవమైంది.


మరోవైపు ఎమ్మెల్సీగా ఎన్నిక కావటంపై బొత్స సత్యనారాయణ స్పందించారు. శ్రావణ శుక్రవారం రోజు ఎమ్మెల్సీగా అధికారికంగా ధ్రువపత్రం అందుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు.శ్రావణ శుక్రవారం కావటంతో మహిళలంతా అమ్మవారిని పూజ చేసుకుంటారన్న బొత్స.. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసేందుకు అవకాశం ఇచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. తాను ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించిన రాజకీయ పార్టీలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రావణ శుక్రవారం మంచిరోజు కావున.. గెలిచినట్లు సర్టిఫికెట్ తీసుకున్నానన్న బొత్స.. త్వరలోనే రాజకీయ అంశాలపై మాట్లాడతానని చెప్పారు. భవిష్యత్తులో విశాఖ జిల్లా అభివృద్ధికి అందరిని కలుపుకుని వెళ్తానని స్పష్టం చేశారు.


మరోవైపు వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. పార్టీ మారటంతో ఆయనపై వైసీపీ ఫిర్యాదు చేయగా.. ఎమ్మెల్సీగా అనర్హత వేటుపడింది. ఈ స్థానంలో ఎన్నికలు నిర్వహించగా.. బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. మరోవైపు బొత్స సత్యనారాయణను ఏపీ శాసనమండలిలో విపక్ష నేతగా నియమిస్తారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం శాసనమండలిలో విపక్ష నేతగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఉన్నారు. అయితే అప్పిరెడ్డి స్థానంలో బొత్సను వైఎస్ జగన్ నియమిస్తారనే వార్తలు వస్తున్నాయి. మరి ఈ అంశం మీద వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదీ చూడాలి మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com