ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ష్యూరిటీ లేకుండా రూ. 20 లక్షలు ఇస్తున్న కేంద్రం.. అప్లై ఎలా

business |  Suryaa Desk  | Published : Mon, Aug 12, 2024, 10:21 PM

సామాన్యుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప పథకాల్లో ప్రధాన మంత్రి ముద్ర యోజన గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ పథకం ద్వారా వ్యాపారం చేయాలనుకునే వారు రూ. 20 లక్షల వరకు పొందొచ్చు. చిన్న వ్యాపారులు సహా సూక్ష్మ, చిన్నతరహా సంస్థలకు లోన్లు అందించాలన్న ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం.. పీఎంఎంవై స్కీమ్ లాంఛ్ చేసింది. అంతకుముందు ఈ స్కీంతో అర్హత కలిగిన వ్యక్తులు.. ఎలాంటి పూచీకత్తు (ష్యూరిటీ) లేకుండానే రూ. 10 లక్షల వరకు లోన్లు పొందే అవకాశం ఉండేది. అయితే ఇటీవల బడ్జెట్ సమయంలో మాత్రం ఈ మొత్తాన్ని డబుల్ చేసింది. అంటే ఇప్పుడు రూ. 20 లక్షలు లోన్ పొందే అవకాశం ఉంది.


2015 ఏప్రిల్ 8న.. స్వయం ఉపాధిని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ స్కీం ప్రారంభించారు. ఈ పథకం కింద కార్పొరేట్, వ్యవసాయేతర బెనిఫిట్స్ కోసం లోన్లు ఇస్తారు. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే యువకులు, నిరుద్యోగులు, మహిళలు, తమ వ్యాపారాల్ని మరింత మెరుగుపర్చుకోవాలనుకునే చిన్న వ్యాపారవేత్తలు వంటి వారు ఈ స్కీంను సద్వినియోగం చేసుకోవచ్చు.


ఇక ఈ పథకం కింద 3 రకాల లోన్లు అందిస్తారు. మొదటిది శిశు లోన్. దీని కింద రూ. 50 వేల వరకు లోన్ వస్తుంది. తర్వాతది కిషోర్ లోన్. ఇక్కడ రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు లోన్ అందుకోవచ్చు. చివరగా తరుణ్ లోన్ కింద రూ. 5 నుంచి 10 లక్షల వరకు గతంలో ఉండగా.. ఇప్పుడు ఇది రూ. 20 లక్షల వరకు తీసుకునే ఛాన్స్ ఉంది.


>> ముద్ర స్కీం కింద లోన్ పొందేందుకు.. దరఖాస్తు దారుడు వ్యాపార ప్రణాళిక సిద్ధం చేసి.. అవసరమైన డాక్యుమెంట్స్ బ్యాంకుకు ఇవ్వాలి. లోన్ కోసం అప్లై చేసేవారు భారతీయుడై ఉండాలి. బ్యాంక్ అడిగిన ఇతర డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వారు బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ డిఫాల్టర్ అవ్వకూడదు. మంచి సిబిల్ స్కోరు కూడా ఉండాలి. దరఖాస్తుదారుడికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండాలి.


>> ఇక ముద్ర లోన్ పొందేందుకు ఎలాంటి ఆస్తుల్ని కూడా తనఖా పెట్టాల్సిన పని లేదు. ప్రాసెసింగ్ రుసుములు కూడా ఏం ఉండవు. ఈ స్కీం లోన్ రీపేమెంట్ వ్యవధి 12 నెలల నుంచి ఐదేళ్ల వరకు ఉంటుంది. అంటే ఐదేళ్లలో తిరిగి చెల్లించకుంటే.. మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. లోన్‌తో వచ్చిన మొత్తానికి వడ్డీ చెల్లించనక్కర్లేదు. ముద్ర కార్డుతో విత్‌డ్రా చేసి ఖర్చు చేసిన దానికి వడ్డీ చెల్లిస్తే చాలు.


ముందుగా ముద్రా యోజన Mudra.org.in అఫీషియల్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. అక్కడ శిశు, కిషోర్, తరుణ్ ఇలా 3 రకాల లోన్లు కనిపిస్తాయి. మీరు ఏది కావాలంటే .. మీకు ఎంత నగదు అవసరం పడుతుందో దానిని బట్టి సరైన కేటగిరీ ఎంచుకోండి. అక్కడ అప్లికేషన్ ఫాం డౌన్‌లోడ్ చేసుకోవాలి. శిశు రుణాలకు ఒకటి.. కిషోర్, తరుణ్ రెండింటికీ కలిపి ఒకటే ఫారం ఉంటుంది. దీనిని ప్రింట్ తీస్కొని.. అడిగిన అన్ని వివరాలు నింపాలి. దానిని సమీప బ్యాంకులో అందించాలి. బ్యాంక్ మీ అప్లికేషన్ వెరిఫై చేసి.. నెల రోజుల్లోపు లోన్ వస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com