ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాందేడ్ - శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు,,,వరుస సెలవుల ఎఫెక్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 12, 2024, 09:19 PM

పంద్రాగస్టు రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. నాందేడ్ నుంచి శ్రీకాకుళం రోడ్ వరకూ రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రత్యేక రైళ్లపై దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. 07487 నంబరుతో ఆగస్ట్ 14న నాందేడ్ నుంచి శ్రీకాకుళం రోడ్‌‍కు ప్రత్యేక రైలు నడుస్తుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు ఆగస్ట్ 14 అంటే బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు నాందేడ్‌లో బయల్దేరనుంది. ఆగస్ట్ 15 అంటే గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీకాకుళం రోడ్‌కు చేరుకుంటుంది. అలాగే ఆగస్ట్ 15వ తేదీ శ్రీకాకుళం రోడ్ నుంచి 07488 నంబర్ సర్వీసుతో ప్రత్యేక రైలు నాందేడ్ బయల్దేరనుంది.


గురువారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీకాకుళం రోడ్ నుంచి బయల్దేరనున్న స్పెషల్ ట్రైన్.. మరుసటి మధ్యాహ్నం అంటే ఆగస్ట్ 16వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల 25 నిమిషాలకు నాందేడ్ చేరుకుంటుందని రైల్వే అధికారులు ప్రకటనలో తెలిపారు. అలాగే ఈ ప్రత్యేక రైళ్లల్లో జనరల్ క్లాస్ బోగీలు లేవని రైల్వే అధికారులు తెలిపారు. కేవలం ధర్డ్ ఏసీ, స్లీపర్ కోచ్‌లో మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. అలాగే ఈ ప్రత్యేక రైళ్లు ముద్కేడ్‌, ధర్మాబాద్‌, బాసర, నిజామాబాద్‌, కామారెడ్డి, సికింద్రాబాద్‌, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, సింహాచలం నార్త్‌, పెందుర్తి, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించనున్నాయి.


మరోవైపు స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్ట్ 15తో పాటుగా వరుసగా సెలవులు రావటంతో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే, ఆ మరుసటి రోజు వరలక్ష్మీ వ్రతం కావటంతో రెండు రోజులు సెలవు ఉంటుంది. ఇక ఆగస్ట్ 18 ఆదివారం, ఆగస్ట్ 19 రాఖీపండుగ రావటంతో వరుసగా సెలవులు ఉన్నాయి. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య, విహారయాత్రలకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఈ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com