ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల వెళ్లే భక్తులు.. నేటి నుంచి ఆంక్షలు అమలు, ఆ టైంలో వెళ్లొద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 12, 2024, 08:18 PM

తిరుమ వెళ్లే భక్తుల్ని టీటీడీ అలర్ట్ చేసింది.. చాలా రోజుల తర్వాత మళ్లీ ఘాట్ రోడ్లలో ఆంక్షలు అమలు చేయనుంది. ఆదివారం తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచారం కలకలంరేపింది. ఓ చిరుత ఘాట్ రోడ్డులో సంచరిస్తూ వాహనదారుల కంటపడింది.. వెంటనే వారు అటవీశాఖ అధికారులు, టీటీడీకీ సమాచారం అందించారు. చిరుత సంచారంతో టీటీడీ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంది.. అటవీశాఖ అధికారుల సూచనలతో టీటీడీ ఆంక్షలు విధించింది. నేటి నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు మాత్రమే ఘాట్ రోడ్లలోకి బైక్‌లను అనుమతిస్తారు. సెప్టెంబర్ 30 వరకు తిరుమ ఘాట్ రోడ్డులో ఆంక్షలు అమలులో ఉంటాయి. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వన్య మృగాల సంచారం ఎక్కువగా ఉంటుంది.. అందుకే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుల్ని గమనించి తమకు సహకరించాలని అటవీశాఖ, టీటీడీ అధికారులు కోరారు.


 చిరుత సంచారం తర్వాత డిప్యూటీ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సూచనల మేరకు టీటీడీ ఘాట్ రోడ్లలో ఆంక్షల్ని తీసుకొచ్చింది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో వన్య ప్రాణులు, మృగాలు సంతానోత్పత్తి చేసే సమయంగా చెబుతుంటారు.. ఈ సమయంలో అధికంగా వన్య మృగాలు సంతానోత్పతి జరుగుతుంది. ఆ కారణంగానే మొదటి, రెండవ ఘాట్ రోడ్డులో చీకటి పడగానే క్రూర మృగాల సంచారం అధికంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.


తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఏపీతో పాటుగా తిరుపతి, చిత్తూరు జిల్లాకు సరిహద్దులో ఉండే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల కొందరు భక్తులు బైక్‌లపై తిరుమలకు వస్తుంటారు. కొందరు భక్తుల తిరుపతి నుంచి అద్దె ప్రాతిపదికన బైకులు తీసుకుని తిరుమలకు వస్తారు. వీరితో పాటుగా తిరుమలలోని టీటీడీలో పనిచేసే ఉద్యోగులు బైక్‌లపై రోజూ రాకపోకలు సాగిస్తుంటారు. రాత్రి సమయంలో ఘాట్ రోడ్లలో వెళ్లే సమయంలో వన్య మృగాలు దాడి చేసే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు, టీటీడీ భావిస్తోంది. అందుకే రెండు ఘాట్‌ రోడ్లలో బైకులపై ఆంక్షల్ని నేటి నుంచి అమలు చేస్తోంది.


గతేడాది కూడా తిరుమల ఘాట్ రోడ్లలో ఆంక్షలు అమలు చేసిన సంగతి తెలిసిందే. అలిపిరి నడక మార్గంలో నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే బాలికను చిరుత అడవిలోకి లాక్కెళ్లి చంపేసింది. అంతకముందు మరో బాలుడిపైనా దాడికి తెగబడిన ఘటన కలకలంరేపింది. ఈ క్రమంలో కొద్దిరోజులు అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో ఆంక్షలు అమలు చేశారు.. ఘాట్ రోడ్లలో బైకులు, వాహనాలపై ఆంక్షలు విధించారు. అటవీశాఖ అధికారులు బోన్‌లు ఏర్పాటు చేసి చిరుతల్ని పట్టుకుని అటవీప్రాంతంలో వదిలేశారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆంక్షల్ని తొలగించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com