ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీకి ఎరువులను విరాళంగా ఇచ్చిన కంపెనీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 12, 2024, 08:14 PM

తిరుమల తిరుపతి దేవస్థానానికి మరో విరాళం అందింది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు సుమారుగా నాలుగు లక్షల రూపాయల విలువైన ఎరువులను విరాళంగా అందించారు. కోరమండల్ ఇంటర్నేషనల్ సంస్థ టీటీడీ ఉద్యానవన విభాగానికి రూ.4.10 లక్షల విలువైన ఎరువులను సోమవారం విరాళంగా అందించింది. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, ఆర్ఎం రమణారెడ్డి, మార్కెటింగ్ ఆఫీసర్ మురళి.. నాలుగు లక్షల విలువైన ఎరువులను తిరుమలలోని కల్యాణవేదిక వద్ద గల ఉద్యానవన విభాగం కార్యాలయంలో అధికారులకు అందజేశారు. తిరుమల, తిరుపతిలోని ఉద్యానవనాల్లో మొక్కల పెంపకానికి ఈ ఎరువులను ఉపయోగించనున్నారు.


 మరోవైపు ఆదివారం రోజున టీటీడీకి భారీ విరాళం అందింది.పంజాబ్‌లోని ట్రైడెంట్ గ్రూప్‌కు చెందిన రాజిందర్ గుప్తా టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.21 కోట్లు విరాళంగా అందించారు. రూ.21 కోట్ల తాలూకు చెక్కును ఆదివారం టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి చేతికి అందించారు. ఎస్వీ ప్రాణదాన ట్రస్టు.. నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ఉంటుంది. ప్రాణాంతక జబ్బులతో బాధపడేవారికి ఉచితంగా వైద్యం, మందులు అందిస్తుంటారు. ఈ క్రమంలోనే ట్రస్టు సేవలను గుర్తించి పంజాబ్ సంస్థ భారీ విరాళం అందించింది. ఎస్వీ ప్రాణదాన ట్రస్టుతో పాటుగా ఎస్వీ అన్నదానం ట్రస్టుకు కూడా పలువురు దాతలు అప్పుడప్పుడూ విరాళాలు అందిస్తుంటారు. ఈ విరాళాలను భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ వినియోగిస్తూ ఉంటుంది.


తిరుమల ఘాట్ రోడ్డులో రాకపోకలపై ఆంక్షలు


మరోవైపు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 12వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకూ ఘాట్ రోడ్డులలో ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. ఈ తేదీల్లో బైక్‌లు సహా ద్విచక్ర వాహనాలు ఉదయం ఆరింటి నుంచి రాత్రి 9 గంటల వరకూ మాత్రమే అనుమతించనున్నట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. రాత్రి 9 గంటలు దాటిన తర్వాత ఉదయం ఆరు గంటల వరకూ ద్విచక్ర వాహనాల రాకపోకలను అనుమతించబోమని స్పష్టం చేశారు.


ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో వన్యప్రాణుల సంతానోత్పత్తి ఎక్కువగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్డులో అటూ ఇటూ సంచరించే అవకాశం ఉందని..దీనిని దృష్టిలో ఉంచుకునే ముందుజాగ్రత్తగా ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ద్విచక్రవాహనాలను అనుమతించాలని నిర్ణయించినట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com