ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుర్గమ్మ సన్నిధిలో అపచారం!.. మండిపడుతున్న భక్తులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 11, 2024, 08:09 PM

విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో అపచారం చోటుచేసుకుంది. అలాగే ఆలయ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. దుర్గగుడి అంతరాలయాన్ని ఓ మహిళా భక్తురాలు వీడియో తీసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంద్రకీలాద్రిపైన కొలువైన బెజవాడ దుర్గమ్మ దర్శనం కోసం ఇటీవల ఓ మహిళా భక్తురాలు వచ్చింది. దర్శనానికి వచ్చిన ఆమె గుడి చుట్టూ తిరుగుతూ వీడియో తీశారు. అలాగే అంతరాలయం లోపల సైతం రికార్డ్ చేశారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై భక్తులు మండిపడుతున్నారు. అంతరాలయం లోపల దుర్గమ్మ నిజరూపాన్ని సైతం వీడియో తీయడంపై మండిపడుతున్నారు.


దుర్గ గుడిలోకి సెల్‌ఫోన్ ప్రవేశం నిషిద్ధమని.. ఎలా ఆలయంలోకి వెళ్లిందంటూ ప్రశ్నిస్తున్నారు. మహిళ వీడియో తీస్తుంటే సీసీ కెమెరాలు, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయంటున్న అధికారులు ఏం చేశారని మండిపడుచున్నారు. అమ్మవారి నిజరూపం సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావటంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే దుర్గ గుడి ఇటీవలి కాలంలో తరుచుగా వార్తల్లో నిలుస్తోంది. మే నెలలో కూడా ఓ ఇంజినీరింగ్ అధికారి రాసలీలల వీడియోలు వైరల్ అయ్యాయి. అప్పట్లోనే ఆలయ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ ఘటనపై ఈవో రామారావు విచారణకు కూడా ఆదేశించారు. ఈ ఘటన మరువకముందే మరోసారి ఇప్పుడు దుర్గ గుడి వార్తల్లోకి ఎక్కింది.


మరోవైపు ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత.. బెజవాడ దుర్గమ్మ దేవస్థానమే అతిపెద్దదిగా చెప్తుంటారు. కనకదుర్గమ్మ దర్శనం కోసం నిత్యం వేలాదిమంది భక్తులు ఇంద్రకీలాద్రికి వస్తుంటారు. ప్రతిరోజూ కనీసం 20 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా. ఇక ఆషాడమాసం, వారాంతాలు, పండుగ రోజుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. దసరా నవరాత్రులు, భవానీదీక్షల సందర్భంగా ఇంద్రకీలాద్రి మొత్తం భక్తులతో నిండిపోతూ ఉంటుంది. అంతటి పవిత్రమైన, ప్రముఖ దేవాలయంలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని భక్తులు కోరుతున్నారు. ఇప్పటికైనా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని.. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com