అమరావతి: కొద్దిసేపటిక్రితమే సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం ముగిసింది. ఈసమావేశంలో చంద్రబాబు అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం వంటి అంశాలను ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. అభ్యర్థుల ఎంపిక ఫిబ్రవరి నెలాఖరు నాటికి పూర్తిచేయాల్సి ఉందని ఎన్నికల ప్రచారంపై ప్రణాళిక రూపొందించుకోవాల్సి ఉందన్నారు. మొత్తం నెలరోజుల పాటు ప్రచారం నిర్వహిస్తానని.. రోజుకు రెండు జిల్లాకు తిరగాలా? రోడ్ షోలు నిర్వహించాలా? బస్సు యాత్ర చేపట్టాలా అన్నది ఆలోచిస్తున్నారన్నారు. ఈనెల 11న ఢిల్లీలో జరిగే దీక్షకు నేతలంతా హాజరవ్వాలని.. రేపు ఢిల్లీకి వెళ్లనున్నానని చెప్పినట్లుగా తెలిసింది. నిరుద్యోగ భృతి అంశాన్ని ప్రస్తావించిన చంద్రబాబు వెయ్యి నుండి రెండువేలకు భృతి పెంచనున్నట్లుగా సభలో ప్రకటించాలని.. ఎన్నికల లోపే భృతిని పెంచాలని నిర్ణయించుకున్నట్లుగా చెప్పారు. కుల సంఘాల నేతలతో మమేకం కావాలని.. ప్రతి కులానికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని చంద్రబాబు సూచించారు.