ఇటీవల 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాం. డీఎస్సీ రాసే గిరిజన అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తాం అని సీఎం చంద్రబాబు తెలిపారు. అయన మాట్లాడుతూ..... అరకు గిరిజన నృత్యం దేశంలోనే ప్రత్యేకమైంది. ఇంత కళ చేతిలో ఉంచుకుని కూడా ఆదివాసీలు చాలా రంగాల్లో వెనుకబడి ఉన్నారు. ప్రతి ఏడాది ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి ప్రకటించగానే జీవో 127ను నాడు టీడీపీ ప్రభుత్వం విడుదల చేసింది. కానీ గత ప్రభుత్వం ఆదివాసీ దినోత్సవం నిర్వహించడం ఆపేసింది. నేను రాజకీయ వివక్ష చూపించను. కక్ష సాధింపులకు పాల్పడను. కానీ దోచిన సొమ్మును రికవరీ చేసి పేదలకు ఖర్చు పెడతాం ఆదివాసీలకు శౌర్యం, ప్రతిభ, నైపుణ్యం ఉంటాయి. ప్రకృతిని ఆరాధిస్తారు. స్వాతంత్య్ర పోరాటంలో ఆదివాసీలు పెద్దఎత్తున పోరాడారు. గిరిజనుల్లో అనేక కట్టుబాట్లు ఉన్నాయి. జీవన ప్రమాణాలు తక్కువ. వారికి కనీసం రోడ్లు కూడా సరిగా లేవు. ఈ పరిస్థితిని తొలగించడానికి గతంలో చైతన్యం కార్యక్రమం రూపొందించాం. అరకు కాఫీని ప్రమోట్ చేశాం. గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలను అందిపుచ్చుకున్నాం అని అన్నారు.