సైబర్ నేరాలను అరికట్టేందుకు 250మంది సైబర్ కమాండోలు, 2వేల మంది సైబర్ సోల్జర్స్కు శిక్షణ ఇచ్చి నియమించినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ తరహా నేరాల సంఖ్య పెరుగుతోందని, వీటిని అరికట్టేందుకే సైబర్ కమాండోలు, సోల్జర్స్ను నియమించినట్లు సీపీ తెలిపారు. ఇకపై సైబర్ నేరగాళ్ల వలలో ప్రజలు పడకుండా వీరి ద్వారా తరచూ అవగాహన కార్యక్రమాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. రానున్న మూడు నెలల్లో మరో 3లక్షల మంది సైబర్ సైనికులను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు కమిషనర్ చెప్పుకొచ్చారు. ఈ తరహా నేరాల బారిన పడుతున్న వారిలో ఎక్కువ మంది విద్యావంతులే ఉంటున్నారని రాజశేఖర్ బాబు తెలిపారు. ఎవరైనా సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని సీపీ రాజశేఖర్ బాబు సూచించారు.