ద్విచక్ర వాహన చోదకుడితోపాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి తప్పనిసరిగా హెల్మెట్ (బీఐఎస్ మార్క్) ధరించాలని విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో కోరారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అమలు చేయడం జరుగుతుందన్నారు. హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం ప్రాణాంతకమన్నారు. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తికి జరిమానా విధించడంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ను మూడు నెలలు సస్పెండ్ చేయడం జరుగుతుందన్నారు. వాహనం నడిపే వ్యక్తి, వెనుక కూర్చన్న వ్యక్తి...ఇద్దరిలో ఏ ఒక్కరు హెల్మెట్ ధరించకపోయినా రూ.1,035 జరిమానా విధించనున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు. నగర ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే బీఐఎస్ మార్క్ స్టాండర్డ్ లేని హెల్మెట్ల అమ్మకందారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.