భార్యను చెరువులో ముంచి హత్యచేశాడంటూ హతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కలిదిండి మండలంలోని సానారుద్రవరం గ్రామంలో పుప్పాల నాగరాజు కూలి పని చేస్తూ జీవిస్తున్నాడు. గురువారం రాత్రి భార్య అనంతలక్ష్మి (33) భర్తను కూలి పనికి సక్రమంగా వెళ్లటం లేదు.. పిల్లలను ఎలా పోషించాలని నిలదీయటంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన నాగరాజు అనంతలక్ష్మిని కొట్టడంతో ఆమె ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన భార్యను ఇంటి సమీపంలో ఉన్న పంచాయతీ చెరువులో ముంచి హత్య చేశాడు. మృతురాలి తల్లి ఆదిలక్ష్మి ఫిర్యాదు మేరకు కైకలూరు సీఐ కృష్ణకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.