ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేదరికం ఎక్కడుంటే, అక్కడ ఉండి పేదరికాన్ని తరుముతాను

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2024, 08:19 PM

రాష్ట్రంలో ఎక్కడ పేదవాడుంటే అక్కడకొచ్చి, కావాల్సిన వనరులిచ్చి పేదరికం నుంచి బయటకు తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘‘గతంలో గిరిజనుల కోసం చైతన్యం కార్యక్రమం తీసుకొచ్చాను. ఈరోజు నుంచి చైతన్యం 2.0ను తీసుకొస్తున్నాను. గిరిజనుల మోముల్లో సంతోషం నింపడం ఈ కార్యక్రమం లక్ష్యం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆదివాసీలు పండించిన ఉత్పత్తులు, తయారుచేసిన కళాకృతులను పరిశీలించారు. అరకు కాఫీని తాగారు. స్వాతంత్ర్యోద్యమంలో ఆదివాసీల పాత్ర, చరిత్రను తెలిపే ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు. గిరిజనులు పేదరికంలో పుట్టి పేదరికంలోనే చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పని చేసినా పేదలను దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. ‘‘ఆదివాసీల్లో పేదరికం ఎక్కువగా ఉంది.. వారిని అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. రాబోయే ఐదేళ్లలో నిర్దిష్ట ప్రణాళికతో పేదరికాన్ని తగ్గిస్తాం. పేరుకు పథకాలివ్వడం కాదు. అవి ఫలితాన్నిచ్చేలా ఉండాలి. గిరిజనుల జీవన ప్రమాణాల్లో మార్పులు తీసుకొస్తాం. ఏఐ గురించి మాట్లాడుకుంటున్న ఈ రోజుల్లో డోలీమోతలు కనబడటం చాలా బాఽధగా ఉంది. రహదారి సదుపాయం లేని ప్రాంతాల నుంచి ఆసుపత్రులకు డోలీల్లో వెళ్తున్నారని గుర్తించి ఫీడర్‌ అంబులెన్సులు తీసుకొచ్చాం. కానీ గత ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసింది. మళ్లీ డోలీల్లో మోసుకొచ్చే పరిస్థితికి తీసుకొచ్చింది. డోలీల్లోనే ప్రసవాలు అవుతున్నాయంటే ఏంటీ ఈ దౌర్భాగ్యం?’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com