ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాగ్రత్తగా చదువుకోండి చంద్రబాబూ .. జగన్ ట్వీట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2024, 08:07 PM

టీడీపీ కూటమి ప్రభుత్వంపైనా, సీఎం చంద్రబాబు నాయుడు పైనా.. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. హామీల అమలు గురించి పదే పదే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైఎస్ జగన్.. ఈసారి ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో.. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ సుధీర్ఘమైన ట్వీట్ వదిలారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సూపర్ టెన్ అంటూ హామీలు గుప్పించిన చంద్రబాబు.. ఇప్పుడు అప్పులు, వడ్డీలు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని.. లేకపోతే ప్రజల పక్షాన వైసీపీ నిలదీస్తుందని స్పష్టం చేశారు.


" చంద్రబాబు గారూ.. ఎన్నికలప్పుడు ఈ రాష్ట్రం బాధ్యత నాది అన్నారు. పైపెచ్చు రాష్ట్రానికి రూ.14లక్షల కోట్ల అప్పులున్నాయని, అయినా సంపద సృష్టిస్తానని, హామీలకు గ్యారెంటీ నాదే అని పదేపదే చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్రం బాధ్యత ప్రజలదంటూ నైజాన్ని బయటపెట్టారు. ఇచ్చిన హామీలనుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చిమోసం కాదా?ప్రమాణస్వీకారం చేసిన తొలి క్షణం నుంచే మీరు ప్లేటు ఫిరాయించారు. ఖజానా ఖాళీ అయిపోయిందంటూ తప్పుడు శ్వేతపత్రాలు జారీచేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అప్పులకు వడ్డీలు కట్టాలి, అవి కట్టడానికే డబ్బుల్లేవు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ లేని అప్పులు ఉన్నట్టుగా, వాటికి లేని వడ్డీలు కడుతున్నట్టుగా పదేపదే మాట్లాడి ప్రజలను మాయచేసే ప్రయత్నం చేస్తున్నారు." అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.


అలాగే తల్లికి వందనం కింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇవ్వలేదన్న వైఎస్ జగన్.. రైతు భరోసా కింద ప్రతి రైతుకు రావాల్సిన రూ.20 వేలు రాలేదని ఆరోపించారు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు పెండింగ్ పెట్టారని.. వసతి దీవెన, సున్నావడ్డీ లేనే లేదని విమర్శించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలా నెలా ఇస్తామన్న రూ.1500 జాడే లేదన్న వైఎస్ జగన్.. ప్రతి ఇంటికీ ఉద్యోగం లేదా రూ. 3వేల నిరుద్యోగ భృతి ఊసే లేదని అన్నారు. మత్స్యకార భరోసా అడ్రస్ లేదని.. ఆరోగ్య శ్రీ చెల్లింపులు పెండింగ్ పెట్టారని వైఎస్ జగన్ ఆరోపించారు.


" ఇంటికి వచ్చి పెన్షన్‌ ఇచ్చే విధానం ఆగిపోయింది. రేషన్‌ నిలిచిపోయింది. వాలంటీర్లను మోసం చేశారు, విత్తనాల కోసం రైతులు క్యూలో నిలబడే పరిస్థితి. పంటలకు ఉచిత బీమా ఎగరగొట్టారు. బడుల్లో టోఫెల్‌ పీరియడ్‌ రద్దు చేశారు. విద్యా కానుక కిట్లు పంపిణీ అరకొరగానే ఉంది. మధ్యాహ్న భోజనం పథకంలో రోజుకో మెనూ పద్ధతి పోయింది. ఇంగ్లిషు మీడియం గాడి తప్పింది, బడుల్లో, గ్రామాల్లో పరిశుభ్రత పడకేసింది. లా అండర్‌ ఆర్డర్‌ పూర్తిగా గాడితప్పింది. రెడ్‌బుక్‌ రాజ్యమేలుతోంది. రాష్ట్రం మూడు హత్యలు, ఆరు విధ్వంసాలుగా వర్ధిల్లుతోంది. మహిళలకు రక్షణే లేదు. దిశయాప్‌ అటకెక్కింది. రెండున్నర నెలల్లోనే ప్రజలను ఇంతలా దగాచేస్తారా చంద్రబాబూ?" అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.


మరోవైపు ఎన్నికలకు ముందు ఏపీ రూ.14 లక్షల కోట్ల మేర అప్పులు పాలైందని విష ప్రచారం చేశారన్న వైఎస్ జగన్.. అపారమైన అనుభవం ఉంది, హామీలను అమలుచేస్తానంటూ హామీలు గుప్పించారని చంద్రబాబును విమర్శించారు. సూపర్ సిక్స్, సూపర్ టెన్ అంటూ ఎన్నికల సమయంలో చాలా వాగ్ధానాలు చేశారని.. అధికారంలోకి వచ్చాక రూ.10 లక్షల కోట్ల అప్పులంటున్నారని మండిపడ్డారు. జూన్‌ 2024 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.7,48,612కోట్లు అప్పులు ఉన్నాయన్న వైఎస్ జగన్.. ఇందులో 2019లో నాటికి ఉన్న అప్పులు రూ.4,08,170 కోట్లని చెప్పారు. పూర్తి వివరాలను లింక్ ద్వారా పంపుతున్నానని జాగ్రత్తగా చదువుకోవాలని సూచించారు. ఇకనైనా అబద్ధపు లెక్కలతో మోసం చేయడం మానీ.. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com