ఫిబ్రవరి మాసంలో ప్రధాని నరేంద్రమోడీ, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అమిత్ షా 3 సార్లు, 2 సార్లు మోడీ రాష్ట్రంలో పర్యటిస్తారని ఆయన చెప్పారు. బుధవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని తాను చేసినట్లుగా చంద్రబాబు చెప్పుకుంటున్నారని పోలవరం ప్రాజెక్టు రైతుల సందర్శన పేరుతో అవినీతి చేస్తున్నారని, కియో మోటార్స్ పేరుతో అవినీతి, భూ కబ్జాలకు పాల్పాడుతున్నారని విమర్శించారు. మేకిన్ ఇండియాలో భాగంగా ఇండియాకి రావాలని మోడీ కియా మోటార్స్ యాజమాన్యాన్ని కోరడం జరిగిందని తెలిపారు. అయితే తెలుగుదేశం నాయకులు పెట్టిన ఇబ్బందులకు కియా కార్ల యాజమాన్యం తిరిగి వెళ్లిపోతుంటే మోడీనే చొరవ తీసుకుని ఇక్కడ కంపెనీ పెట్టేలా చేశారని కన్నా చెప్పారు. హోదా వద్దని ప్యాకేజీకి ఒప్పుకున్నందుకే కియా మోటార్స్ ని రాష్ట్రానికి ఇచ్చారని చంద్రబాబు కుమారుడు లోకేష్ అన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు చెప్పుకోవడానికి ఈ నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధి ఏదైనా ఉందా అని కన్నా ప్రశ్నించారు.