ఎయిర్ సెల్- మాక్సిక్ ఒప్పందం, ఐఎన్ఎక్స్ మీడియా కేసుకి సంబంధించి మార్చి 5,6,7,12 తేదీల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరవ్వాలని కార్తీ చిదంబరంను బుధవారం(జనవరి 30,2019) సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా కార్తీపై సుప్రీం సీరియస్ అయింది. చట్టంతో చెలగాటమాడవద్దని కార్తీని ధర్మాసనం హెచ్చరించింది. అంతేకాకుండా కార్తీ విదేశాలకు వెళ్లాలనుకుంటే కోర్టు రిజిస్ట్రీ దగ్గర 10 కోట్ల రూపాయల డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఎక్కడికి కావాలి అనుకుంటే కార్తీ అక్కడికి వెళ్లవచ్చునని, ఏది కావాలనుకుంటే అది చేయవచ్చని అయితే చట్టంతో మాత్రం ఆడుకోవద్దని, విచారణకు సహకరించకపోతే తాము తీవ్ర చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ కార్తీకి సూచించారు.