మైనర్లకు వాహనాలు ఇస్తే వారు ఎలాంటి ప్రమాదం చేసినా తల్లిదండ్రులు, వాహన యజమానులకు చట్టప్రకారం శిక్షలు తప్పవని నంద్యాల ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా హెచ్చరించారు. బుధవారం ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం నేరమన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపి, ప్రమాదాలకు కారణమైతే అందుకు పూర్తి బాధ్యత వాహనదారుడే వహించాల్సి ఉంటుందన్నారు. ప్రమాదానికి గురైనా ఇన్సురెన్స్ పొందడంలో ఇబ్బందులు తలెత్తుతాయని, అందువల్ల వాహనదారులు మైనర్లకు వాహ నాలు ఇవ్వొద్దని సూచించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగినా, రహదా రులపై ఇబ్బందికరంగా వాహనాలు నిలిపినా వెంటనే డయల్ 100కు సమాచారం అందించి ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. జాతీయ రహదారులపై స్పీడ్ గన్స్తో వేగ నియంత్రణకు కృషి చేయాలన్నారు. డ్రంకెన్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ లైసెన్స్లపై ప్రధానంగా దృష్టి సారించడంతో పాటు హెల్మెట్, సీటు బెల్టు ధరించేలా చర్యలు తీసుకోవా లన్నారు. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకుండా, పరిమితికి మించి ప్రయాణికులు వాహనాల్లో వెళ్లకుండా అవసరమైన జాగ్రత్తలు చేపడితే దాదాపు రోడ్డు ప్రమాదాలను నియంత్రించవచ్చని ఎస్పీ తెలిపారు. వాహన దారులు ట్రాఫిక్ పోలీసుల నిబంధనలు, సూచనలు పాటిస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా సురక్షితంగా గమ్యం చేరాలని సూచించారు.