అధికారులపై దాడి చేసిన కేసులో ముగ్గురికి పలాస జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి యు.మాధురి ఆరు నెలల జైలుశిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు ఇచ్చినట్లు కాశీబుగ్గ సీఐ విజయకుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పలాస మండలం రేగులపాడులో ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా 2017లో నిర్వాసితులకు పునరావాస కాలనీ నిర్మించేందుకు 50 ఎకరాల స్థలం టెక్కలిపట్నం పరిసర ప్రాంతంలో కేటాయించారు. స్థలాన్ని పరిశీలించేందుకు అప్పటి వీఆర్వో, సర్వేయర్లు వెళ్లగా టెక్కలిపట్నం, కమలాపురానికి చెందిన రైతులు వారిని అడ్డుకుని దాడి చేశారు. దీనిపై అప్పటి తహసీల్దార్ కల్యాణ చక్రవర్తి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి సీఐ అశోక్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ ఘటనపై ఏపీపీ పి.రమేష్ వాదించారు. తుది విచారణ చేసిన న్యాయాధికారి మాధురి టెక్కలి పట్నంనకు చెందిన నంద కుమార్, జోగ పార్వతి, కమలాపురానికి చెందిన మడ్డు రంగారావులను ముద్దాయిలుగా నిర్థారిస్తూ.. వీరికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు సీఐ విజయకుమార్ తెలిపారు.