శ్రీకాకుళం నగర ప్రాంతమైన జీటీరోడ్డులోని పరమేశ్వరి బ్యాంగిల్స్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్ షాపులో బుధవారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో ఊపిరాడక, ఏం జరిగిందో తెలియక.. దుకాణంలో ఉన్నవారితో పాటు చుట్టుపక్కల ఉన్న దుకాణాల్లో పని చేసేవారు రోడ్డుపైకి పరుగులు తీశారు. ఇంతలో బ్యాంగిల్ షాపులో మంటలు చెలరేగాయి. ప్రజలంతా అక్కడకు చేరుకుని మంటలు ఆపేందుకు ప్రయత్నించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఏడీఎఫ్ఓ వరప్రసాద్ తన సిబ్బందితో అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇదిలా ఉండగా బ్యాంగిల్ దుకాణంలో దట్టమైన పొగలు, మంటలు చెలరేగడంతో.. ఆ బిల్డింగ్ పైఅంతస్థులోని ఓ ఈవెంట్ షాపులో ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఊపిరాడక అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. వారిద్దరినీ అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చి సపర్యలు చేయడంతో వారి పరిస్థితి మెరుగుపడింది. విద్యుత్ షార్క్ సర్క్యూట్ వల్ల దుకాణంలో మంటలు వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. షాపు యజమాని వెల్లంపల్లి మణికంఠ ఫిర్యాదు మేరకు సుమారు రూ.10లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో జీటి రోడ్డులో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ సీఐ ఎం.అవతారం తన సిబ్బందితో పరిస్థితిని చక్కదిద్దారు.