ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన తెలుగు ప్రజలను సొంతూరికి చేర్చడంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే విదేశాల్లో చిక్కుకుపోయిన మరో యువతికి సాయం చేసేందుకు నారా లోకేష్ ముందుకు వచ్చారు.
తాజాగా ఒమన్ దేశంలో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న ఓ మహిళకు సాయం చేస్తానని నారా లోకేష్ మాటిచ్చారు. మామిడి దుర్గ అనే యువతి ఉద్యోగం కోసం ఒమన్ వెళ్లి ఆరోగ్యం బాగలేక ఇబ్బందులు పడుతున్నారు. ఏజెంట్ చేతిలో మోసపోయిన మామిడి దుర్గకు ఏం చేయాలో పాలుపోక సాయం కోసం నారా లోకేష్ను ఆశ్రయించారు. తన బాధలు చెప్పుకుంటూ తన ఆరోగ్యం బాగాలేదని.. ఇంటికి తీసుకెళ్లాలంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తనను రక్షించాలని, ఇంటికి తీసుకెళ్లాలంటూ ప్రాధేయపడ్డారు.
" అన్నా నా పేరు మామిడి దుర్గ. నేను ఒమన్ వచ్చి నాలుగు నెలలు అవుతోందన్నా. నాకు వారం రోజుల నుంచి బాలేదన్నా.. నాకు ఆరోగ్యం ఏ మాత్రం బాలేదన్నా. ఇక్కడ చెప్పినా కూడా అర్థం చేసుకోవడం లేదు. డబ్బులు కట్టేసి ఇంటికెళ్తానన్న ఏజెంట్ పంపించడం లేదు. ఆఫీసు వాళ్లూ స్పందించడం లేదు. అన్నా లోకేషన్నా.. నన్ను ఇండియాకు తీసుకెళ్లన్నా.. నాకు చాలా నీరసంగా ఉంది. నాకు కాళ్లు కూడా పట్టేశాయి. ఏ మాత్రం బాగోలేదు. వీళ్లకు ఎంత చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. పని చేయమనే చెప్తున్నారు. రాత్రి రెండింటి వరకూ పనిచేస్తూనే ఉన్నా. ఏ మాత్రం రెస్ట్ ఇవ్వడం లేదు. ప్లీజ్ నన్ను మీ తోడబుట్టిందనుకుని ఇండియాకు తీసుకెళ్లన్నా. ఇంత వరకూ పోరాడాను. ఇక నా వల్లకాదు. అందుకే వీడియో చేశా. దయచేసి నాకు సహాయం చేసి ఇంటికి పంపించండి అన్నా" అంటూ దుర్గ అనే యువతి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది.
యువతి వీడియో అంశం నారా లోకేష్ వరకూ చేరింది. దీనిపై ఆయన స్పందించారు. భయపడకు అమ్మా. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నుంచి విదేశాంగశాఖ అధికారులతో మాట్లాడి త్వరలోనే నిన్ను ఇండియాకు తీసుకొస్తామంటూ ఆ యువతికి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. మామిడి దుర్గను సొంతూరికి చేర్చే ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు కువైట్ వెళ్లి చిక్కుకుపోయిన అన్నమయ్య జిల్లా వాసి శివ కూడా నారా లోకేష్ జోక్యంతోనే సొంతూరుకు చేరుకున్నాడు, అలాగే ఏజెంట్ మోసంతో ఖతార్లో చిక్కుకుపోయిన కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన వీరేంద్రను సైతం.. నారా లోకేష్ సొంతూరికి చేర్చారు. తాజాగా మామిడి దుర్గను సైతం సొంతూరు చేరుస్తానని నారా లోకేష్ మాటిచ్చారు.