ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతికి రూ.15000 కోట్లు గ్రాంటా.. రుణమా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 07:30 PM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కేంద్ర బడ్జెట్‌లో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.15000 కోట్లు ప్రత్యేక సాయం ప్రకటించింది. అంతేకాకుండా అవసరమైతే అదనపు నిధులు కూడా కేటాయిస్తామంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇవాళ సూర్యోదయమని.. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం ఇక పరుగులు పెడుతుందంటూ టీడీపీ కూటమి నేతలు.. సామాన్య ప్రజానీకం కూడా సంబరపడ్డారు. అయితే ఇదే సమయంలో అమరావతి నిర్మాణానికి కేంద్రం అందిస్తామన్న 15 వేలకోట్లు గ్రాంటా.. లేదా రుణమా అనే చర్చ మొదలైంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఈ చర్చ ప్రారంభమైంది.


అమరావతికి కేంద్రం అందిస్తామన్న రూ.15000 కోట్లు గ్రాంట్ అని టీడీపీ నేతలతో సహా కొంతమంది నెటిజనం అభిప్రాయపడుతుంటే.. కాదు కాదు.. అప్పు రూపంలో ఇస్తోందని, ఈ మాత్రం దానికే టీడీపీ నేతలు జబ్బలు చరుచుకుంటున్నారని వైసీపీ కార్యకర్తలు, నేతలు అభిప్రాయపడుతున్నారు. మల్టీ లేటరల్ ఏజెన్సీస్ ద్వారా 15 వేల కోట్లు ఆర్థిక సాయం అందిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారని.. ఏజెన్సీలు గ్రాంట్లు ఇవ్వవు, అప్పులే ఇస్తాయంటున్నారు. అయితే అప్పే అయితే బడ్జెట్‌లో ఎందుకు పెడతారంటూ మరికొందరు వాదిస్తున్నారు. దీంతో అమరావతికి కేంద్రం ఇస్తామన్న రూ.15000 కోట్లు అప్పా.. లేదా గ్రాంటా అనే దానిపై చాలా సందేహాలు వ్యక్తమయ్యాయి.


ఇదే సమయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్‌తో ఈ పదిహేను వేల కోట్లు గ్రాంట్ కాదా అనే సందేహాలు మరింత ముదిరాయి. అమరావతికి 15000 కోట్లు అప్పు వివిధ సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్ లో ప్రకటిస్తే గొప్పలు చెప్పుకుంటున్నారు.. సంపద సృష్టించడం అంటే అప్పులు తెచ్చుకోవడం అన్నమాట అంటూ రాంబాబు ట్వీట్ చేశారు. మరోవైపు బీజేపీ నేతలు కూడా ఈ విషయమై స్పందించారు. కేంద్రం అమరావతికి ప్రకటించింది రుణం కాదని.. గ్రాంటేనని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ క్లారిటీ ఇచ్చారు. ఇక బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా దీనిపై స్పష్టత ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం చేయాల్సి ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు.


ఆందులో భాగంగానే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచబ్యాంకు నుంచి రూ.15000 కోట్లు ఏపీకి ఇస్తున్నట్లు చెప్పారు. దీనికి అదనంగా నిధుల కేటాయింపు కూడా ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారు ఇస్తారా లేదా కేంద్రం గ్రాంట్ ఇవ్వాలా అనేది చూస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. అమరావతి నిర్మాణానికి మాత్రం కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.


అయితే విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా రుణం మంజూరు చేయించి కేంద్రం ఎలా చెల్లిస్తుందో, అలాగే రాజధాని అమరావతి విషయంలోనూ కేంద్రం సహకరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అమరావతికి ఇప్పించే 15 వేల కోట్లను కూడా కేంద్రమే చెల్లిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com