ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లడ్డూ రుచి వెనుక సీక్రెట్ చెప్పిన టీటీడీ ఈవో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 07:36 PM

తిరుమల లడ్డూలో రుచి తగ్గిందని.. శ్రీవారి లడ్డూ నాణ్యత తగ్గిందంటూ భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టి తిరుమల కొండపై ప్రక్షాళన ప్రారంభించిన టీటీడీ ఈవో శ్యామలరావు .. లడ్డూ ప్రసాదంపైనా దృష్టిసారించారు. ఈ క్రమంలోనే శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతను పరిశీలించేందుకు మంగళవారం.. అప్పటికప్పుడు తయారు చేసిన లడ్డూలను రుచి చూశారు. అనంతరం శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి, ఎండు ద్రాక్ష, జీడిపప్పు వంటి పదార్థాలను ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారనే విషయాలను టీటీడీ ఈవో శ్యామలరావు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత నాణ్యమైన నెయ్యితో మరోసారి లడ్డూలు తయారుచేయించిన టీటీడీ ఈవో.. వాటి నాణ్యతను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా క్వాలిటీ నెయ్యి వాడకం ద్వారా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం రుచి పెరుగుతున్న విషయాన్ని ఈవో శ్యామలరావు గుర్తించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన శ్యామలరావు.. తిరుమల లడ్డూ నాణ్యతపైన కీలక విషయాలు వెల్లడించారు.


శ్రీవారి లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టిపెట్టామన్న టీటీడీ ఈవో శ్యామలరావు.. నాణ్యమైన నెయ్యి వాడితే లడ్డూ నాణ్యత వస్తుందని నిపుణులు చెప్పినట్లు తెలిపారు. నాణ్యమైన క్వాలిటీ నెయ్యి తీసుకొని లడ్డు తయారు చేయించామని.. నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ క్వాలిటీ పెరుగుతుందన్నారు. మరోవైపు అడల్ట్రేషన్‌ను టెస్ట్ చేసే పరికరం టీటీడీ వద్ద లేదన్న ఈవో.. ప్రొక్యూర్‌మెంట్ సిస్టంలోనూ కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. కాంట్రాక్టర్ మరో సబ్ కాంట్రాక్టర్‌కు సబ్ లీజ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని శ్యామలరావు వివరించారు.


నెయ్యిపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామన్న టీటీడీ ఈవో శ్యామలరావు.. ఈ కమిటీలో నలుగురు నిపుణులను నియమించినట్లు చెప్పారు. క్వాలిటీ నెయ్యి కోసం టెండర్‌లో ఎలాంటి అంశాలు చేర్చాలనేదీ ఈ కమిటీ సూచిస్తుందన్నారు. నెయ్యికి ఆరోమా చాలా అవసరమని.. వీటి ద్వారా రేటింగ్ వేయడానికి నివేదిక ఇవ్వాలని కమిటీని కోరినట్లు చెప్పారు. అలాగే ప్రస్తుతం నెయ్యిని సరఫరా చేస్తున్న సప్లయర్స్‌ను పిలిచి క్వాలిటీ నెయ్యి సరపరా చేయాలని ఆదేశించినట్లు చెప్పారు.


మరోవైపు నెయ్యిని సరఫరా చేసే సంస్థల్లో కొన్ని నాణ్యమైన నెయ్యి పంపిస్తున్నారన్న టీటీడీ ఈవో.. మరికొన్ని సంస్థలు నాసిరకం నెయ్యిని పంపిస్తున్నాయని ఈవో చెప్పారు. కల్తీ నెయ్యి పంపిస్తున్న ఓ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టామని.. మరో కంపెనీపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెండు కంపెనీలకు షోకాజ్ నోటీసులు పంపించామన్నారు. త్వరలోనే తిరుమలలో అడల్ట్రేషన్ టెస్టింగ్ పరికరాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్న శ్యామలరావు.. ఆర్గానిక్ ఆహార పదార్థాలు వాడటం వల్లే శ్రీవారి అన్నప్రసాదం రుచిలో కాస్త తేడా ఉన్నట్లు వివరించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com