ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెలరోజుల్లోగా వారికి రేషన్ కార్డులు జారీ చేయండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

national |  Suryaa Desk  | Published : Tue, Jul 16, 2024, 11:50 PM

వలస కార్మికులకు సంబంధించి రేషన్‌ కార్డులు జారీ చేయడంలో దేశంలోని ఆయా రాష్ట్రాలు చేస్తున్న ఆలస్యాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే తాజాగా కీలక ఆదేశాలు వెలువరించింది. వలస కార్మికుల రేషన్‌ కార్డుల వెరిఫికేషన్‌ను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బతుకుదెరువు కోసం వచ్చిన వలస కార్మికులకు నెలరోజుల్లోగా ప్రక్రియను మొత్తం పూర్తి చేసి.. రేషన్ కార్డులు అందించాలని ఆదేశాలు వెలువరించింది. ఈ సందర్భంగానే రేషన్‌ కార్డుల కోసం ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్న దాదాపు 8 కోట్ల వలస కార్మికుల వెరిఫికేషన్‌ ప్రక్రియను వివిధ రాష్ట్రాలు ఆలస్యం చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితి చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.


నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ (జాతీయ ఆహార భద్రత చట్టం) కింద కోటాతో సంబంధం లేకుండా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వలస వెళ్లిన కార్మికులకు ఆయా రాష్ట్రాలు రేషన్‌ అందించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గతంలోనే విచారణ జరిపింది. ఈ క్రమంలోనే ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న దాదాపు 8 కోట్ల మంది వలస కార్మికులకు రేషన్‌ కార్డులు జారీ చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ.. ఇప్పటికీ.. దేశంలోని చాలా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు.. వెరిఫికేషన్ పూర్తి చేయకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు తెలంగాణ, బిహార్‌ రాష్ట్రాలు మాత్రమే వలస కార్మికుల రేషన్‌ కార్డుల జారీ కోసం 100 శాతం వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి చేశాయి.


ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా రాష్ట్రాలు పెండింగ్‌లో ఉంచిన విషయాన్ని సీనియర్‌ అడ్వొకేట్‌ ప్రశాంత్‌ భూషణ్‌ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాల్లో రేషన్ కార్డులు జారీ అయినప్పటికీ.. వలస కార్మికులకు రేషన్ సరుకులు అందించడం లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు రేషన్‌ రావట్లేదని ఆయా రాష్ట్రాలు చెబుతున్నాయని చెప్పడంతో.. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.


వలస కార్మికుల రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ ఆలస్యం చేయడం చాలా దురదృష్టకరమైన విషయమని.. వారికి రేషన్ ఇవ్వాలని పేర్కొంది. తాము ఆదేశాలు జారీ చేసి 4 నెలలు పూర్తయినా వెరిఫికేషన్‌ ప్రక్రియను ఎందుకు పూర్తి చేయలేదని నిలదీసింది. పైగా ఇప్పుడు మరో 2 నెలలు గడువు కావాలని అడుగుతున్నారని.. దానికి అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. 4 వారాల్లోగా అన్ని రాష్ట్రాలు వలస కార్మికుల వెరిఫికేషన్‌ను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ రాష్ట్రాలు ఈ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయలేకపోతే ఆయా రాష్ట్రాల కార్యదర్శులకు సమన్లు జారీ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 27వ తేదీకి వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com