ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇద్దరూ అంతకంటే ఎక్కువమంది పిల్లలుంటే ప్రభుత్వ పథకాలు కట్

national |  Suryaa Desk  | Published : Tue, Jul 16, 2024, 11:49 PM

జనాభా నియంత్రణ, ప్రభుత్వ పథకాలకు సంబంధించి రాజస్థాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇద్దరు అంతకన్నా ఎక్కువ మంది సంతానం ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు నిలిపివేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటూ ఆయన పేర్కొనడం పెను సంచలంగా మారింది. జనాభా నియంత్రణ చట్టానికి సంబంధించి రాజస్థాన్ మంత్రి జబర్ సింగ్ ఖర్రా చేసిన ప్రకటన ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న దంపతులు ఎలాంటి ప్రభుత్వ ప్రయోజనాలకు అర్హులు కాదని జబర్ సింగ్ ఖర్రా పేర్కొన్నారు. అయితే ఈ మంత్రి చేసిన వ్యాఖ్యలకు ఓ ఎమ్మెల్యే కూడా వత్తాసు పలకడం మరింత దుమారం రేపింది.


రాజస్థాన్‌లోని పాలిలో ఆదివారం పర్యటించిన ఆ రాష్ట్ర మంత్రి జబర్ సింగ్ ఖర్రా ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఓ వైపు జనాభా పెరుగుతుంటే మరోవైపు.. వనరులు తగ్గుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. జనాభా పెరగడం అనేది ప్రస్తుత కాలంలో వివిధ సమస్యలకు దారి తీస్తోందని అన్నారు. అందుకే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలను కన్న దంపతులకు ఏ ప్రభుత్వాన్ని అందకుండా చూసే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. దీనికి సంబంధించిన కొత్త చట్టం త్వరలోనే దేశంలో అమల్లోకి వస్తుందని ఆయన చెప్పడం గమనార్హం.


ఈ సందర్భంగా రాజస్థాన్ రాష్ట్ర బడ్జెట్ గురించి మాట్లాడిన మంత్రి జబర్ సింగ్ ఖర్రా.. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ను రూపొందించినట్లు చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుస్తామని తేల్చి చెప్పారు. బీజేపీ ప్రకటన చేయడమే కాదు.. వాటిని తప్పకుండా నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. రాజస్థాన్‌లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరిగిందని తెలిపారు. అందుకే ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని సకాలంలో నెరవేరుస్తామని వెల్లడించారు.


ఇక జనాభా నియంత్రణ చట్టం ఉండాలని జైపూర్ హవా మహల్ బీజేపీ ఎమ్మెల్యే బల్ముకుంద్ ఆచార్య కూడా పేర్కొన్నారు. ఒక్కొక్కరికీ నలుగురు భార్యలు.. 36 మంది సంతానం ఉండటం ఇక నుంచి ఆమోదయోగ్యం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి ఒకే చట్టం ఉండాలని చాలా ఏళ్లుగా తాను నిరంతరం డిమాండ్ చేస్తున్నట్లు ఎమ్మెల్యే బల్ముకుంద్ చెప్పారు. తాము ఒకసారి జమ్మూ కాశ్మీర్‌కు వెళ్లినపుడు.. మీరు భారతదేశానికి చెందిన వారా అని అక్కడివారు అడగడం తీవ్రంగా బాధించిందని చెప్పారు. ప్రస్తుతం ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో కూడా దేశవ్యాప్తంగా అమలు అవుతున్న చట్టాలే అమలులోకి వచ్చాయని చెప్పారు.


పెరుగుతున్న జనాభా దేశానికి తీవ్ర సమస్యగా మారుతోందని పేర్కొన్న ఎమ్మెల్యే బల్ముకుంద్.. జనాభా సమతుల్యత దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే నలుగురు భార్యలు, 36 మంది పిల్లలను పోషించే వర్గం ఉందని.. ఆ వర్గానికి చెందిన కొందరు నేతలు అసెంబ్లీలో కూడా ఉన్నారని చెప్పారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com