ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి దీక్ష ముగిసింది. 11 రోజుల పాటు ఈ దీక్షను నిర్వహించిన పవన్ కళ్యాణ్.. శుక్రవారంతో ముగించారు. సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి ఏకాదశ దిన దీక్ష వారాహి అమ్మ వారి ఆరాధన, కలశోద్వాసన క్రతువుతో పరిసమాప్తమైందని జనసేన తెలిపింది. మరోవైపు దీక్ష ముగింపు సందర్భంగా.. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వారాహి మాతకు పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏక హారతి, ద్వి హారతి, త్రి హారతి, చతుర్ధ, పంచ, నక్షత్ర హారతులు సమర్పించారు. అనంతరం కుంభ హారతితో వారాహి దీక్ష సంపూర్ణమైంది. మరోవైపు వారాహి దీక్ష పూరైన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరో దీక్ష చేయనున్నారు. పవన్ చాతుర్మాస దీక్ష చేయనున్నారు. గృహస్తాచార రీతిలో ఈ దీక్ష చేస్తారన్న జనసేన.. అధికార కార్యకలాపాలను కొనసాగిస్తూనే శుభ తిధుల్లో మాత్రం దీక్ష వస్త్రాలను ధరిస్తారని ప్రకటనలో తెలిపింది. దీక్షా కాలంలో పరిమిత సాత్వికాహారం మాత్రమే స్వీకరిస్తారని పేర్కొంది