విశాఖ నగరానికి ప్రధాన సమస్యలైన గంజాయి, నార్కోటిక్ డ్రగ్స్ నియంత్రించడంపై దృష్టి పెట్టామని విశాఖ నగరర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. నేడు ఆయన మాట్లాడుతూ.. సరికొత్త పద్ధతుల్లో ప్రతిరోజు నగరంలో తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. డైనమిక్ చెక్లో భాగంగా మొదటి రోజే 20 కేజీల గంజాయిని పట్టుకున్నామని వెల్లడించారు. నగరంలో పోస్టింగ్ చేసేందుకు ఆశ చూపించిన పోలీసు అధికారులు... తాను కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వెనకడుగు వేశారన్న మాట వాస్తవమని శంఖబ్రత బాగ్చి తెలిపారు. అవినీతి వద్దు ప్రజాసేవ ముద్దు అన్నది తన లక్ష్యమని వెల్లడించారు. పోలీస్ సిబ్బంది అవినీతికి పాల్పడితే సహించేది లేదని తెలిపారు. ప్రభుత్వం గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దాలని తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెడతానన్నారు. తనకు రోజు 500 ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. అందులో ట్రాఫిక్ సమస్యలు, భూ కబ్జాలు, పాత కేసులు, భార్యాభర్తల గొడవలపై ఎక్కువగా వస్తున్నాయన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తానెప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. తనకు ఫోన్ లేదా వాట్సప్ మెసేజ్, వాయిస్ రికార్డ్, వీడియో రూపంలో సమాచారం అందించాలని సూచించారు.