ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆదరణ పథకం పనిముట్లు ఏమైపోయాయి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 29, 2024, 01:19 PM

గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆదరణ పథకం కింద మంజూరై లబ్ధిదారులకు చేరకుండా ఉంచిన సుమారు రూ.కోటి విలువైన పరికరాలు మాయమయ్యాయి. 2014-19 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆదరణ పథకాన్ని ప్రవేశపెట్టింది. సంప్రదాయ వృతుల వారికి ఆధునిక పనిముట్లను అందించే లక్ష్యంతో ఈ పథకం రూపొందించారు. పొన్నూరు మండలంలో కూడా 2018-19 ఆర్థిక సంవత్సరంలో గ్రామాల్లో చేతివృతుల వారికి పంపిణీ చేసేందుకు ఆదరణ పథకం కింద పెద్దఎత్తున పనిముట్లు మంజూరయ్యాయి. పొన్నూరు పట్టణంలోని మార్కెట్‌ యార్డు గోదాములో ఈ పరికాలను ఉంచారు. ఎంపీడీవో కార్యాలయ అధికారుల నియంత్రణలో ఈ పరికరాలు ఉన్నాయి. 2019 ఎన్నికలకు ముందు ఈ పరికరాల పంపిణీ ఎన్నికల కోడ్‌ మూలంగా నిలిచిపోయాయి. అయితే ఇటీవల కొత్తగా వచ్చిన అధికారులు ఆదరణ పరికరాల వివరాలను గత అధికారులను కోరగా కుంటిసాకులు చెబుతూ వచ్చారు. అధికారులు లోతైన విచారణ చేపట్టగా పరికరాలు మాయమైనట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆదరణ పథకం కింద రైతులకు సుమారు రూ.50 వేల విలువైన వాషింగ్‌ మిషన్లు, పశు పోషకులకు ఖరీదైన గ్రాస్‌ కట్టర్లు, కుట్టుమిషన్లు, పాడి రైతులకు సైకిళ్లు, చేపల అమ్మకం కొనుగోలుదారులకు సంబంధించిన పరికరాలతో పాటు పలు విలువైన పరికరాలు గోడౌన్‌లో ఉండాలి. గత వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన మండల పరిషత్‌ అధికారులు, ఆ పార్టీ నాయకులు ఈ పరికరాలను గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకొని సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. దీనిపై ఎంపీడీవో పి .రత్న జ్యోతిని వివరణ కోరగా ఆదరణ పరికరాల విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులను వాటి వివరాలు అందచేయాల్సిందిగా నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com