భీమవరంలో పేదలకు ఇచ్చిన ఇళ్లపై ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కీలక వ్యాఖ్యలు చేశారు. మంచినీటి చెరువులు వద్ద ఇళ్లు నిర్మించకూడదని చెప్పారు. గతంలో భీమవరం ప్రజలకు మంచినీరు అందించేందుకు 50, 60 ఎకరాల్లో రెండు చెరువులు తవ్వించారని గుర్తుచేశారు. భీమవరం మున్సిపల్ అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామాంజినేయులు మాట్లాడుతూ.... ఇంకో 60 ఎకరాలు చెరువు తవ్వడానికి లాండ్ ఎక్విజేషన్ కోసం సిద్ధం చేశామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం దూరాలోచనతో 60 ఎకరాలు తీసేసుకుని పేదలకు ఇళ్లు ఇచ్చిందన్నారు. ఇప్పుడు కట్టే ఇళ్ల వల్ల చెరువుల్లోని సీపేజ్ వచ్చి నీరు కలుషితం అయ్యే ప్రమాదం ఏర్పడిందని హెచ్చరించారు. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్కి పెద్ద ప్రమాదం తీసుకువచ్చారన్నారు. 2869 ఇళ్లు కడితే వాళ్లు వాడే నీరు, టాయిలెట్ వాడకం ఎక్కడికి వెలుతుందని ప్రశ్నించారు. చాలా తెలివి తక్కువ, దూరాలోచన లేని పని గత ప్రభుత్వం చేసిందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయంతో 50 సంవత్సరాల తర్వాత భీమవరం భవిష్యత్ అంధకారం అయ్యే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.