పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. పిన్నెల్లిని కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకువచ్చిన సమయంలో కోర్టు వద్దే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనపై దురుసుగా వ్యవహరించారు. పిన్నెల్లికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోర్టు ముందే పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి వైయస్ఆర్సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. పిన్నెల్లిని కోర్టు లోపలికి తీసుకువెళ్లే సమయంలో ఆయన ముందు పోలీసులు ఎవరూ లేరు. అందువల్లే టీడీపీ కార్యకర్త శివ కోర్టు ప్రాంగణంలోనే నేరుగా పిన్నెల్లికి ఎదురు రాగలిగాడు. వెంటనే అతన్ని నిలువరించకపోగా, అతను కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా, దాడికి యత్నించినా పట్టించుకోకపోవడం పోలీసుల ఉద్దేశపూర్వక చర్యేనని వైయస్ఆర్సీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. పైగా, ఉద్దేశపూర్వకంగా కోర్ట వద్దే పిన్నెల్లికి అడ్డు నిలబడి, దుర్భాషలాడిన టీడీపీ కార్యకర్త శివే తనపై పిన్నెల్లి దాడి చేశారంటూ మాచర్ల పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.