అధికార ఎన్డీయే.. విపక్ష ఇండియా కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో లోక్సభ స్పీకర్ పదవికి పోటీ అనివార్యమైంది. ఎన్డీయే తరఫున మాజీ స్పీకర్ ఓం బిర్లా.. ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ సీనియర్ నేత కొడికున్నిల్ సురేశ్ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో దాదాపు 48 ఏళ్ల తర్వాత సభాపతి పదవికి ఎన్నిక జరగనుంది. సంప్రదాయానికి అనుగుణంగా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు అధికార పక్షం అంగీకరించకపోవడంతో ప్రతిపక్షం చివరి నిమిషంలో స్పీకర్ పదవికి అభ్యర్థిని దింపింది. ఓం బిర్లా తరఫున 10 సెట్లు, సురేశ్ తరఫున 3 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి.
ఇద్దరు పోటీలో ఉండటంతో బుధవారం స్పీకర్ ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం సభలో ఎన్డీయేకు 293 మంది, ఇండియా కూటమికి 233 మంది సభ్యుల బలం ఉంది. ఎన్డీయే అభ్యర్ధి ఓం బిర్లా ఎన్నిక లాంఛనమే. అయితే, మరో ఏడుగురు ఎంపీల ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. వీరిలో ఐదుగురు ఇండియా కూటమి ఎంపీలు, ఇద్దరు స్వతంత్రులు. ప్రమాణం చేయనందున వీరికి ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉండదు. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, టీఎంసీ ఎంపీలు శత్రుఘ్న సిన్హా, నూరుల్ ఇస్లాం, సమాజ్ వాదీ పార్టీకి చెందిన అఫ్జల్ అన్సారీలు ప్రమాణం చేయాల్సి ఉంది. అయితే, వీరి ప్రమాణస్వీకారం ఎందుకు పెండింగ్లో ఉందనే కారణం మాత్రం తెలియరాలేదు.
కాగా, ప్రస్తుతం ఉన్న ఇండియా కూటమికి 233 సభ్యులుండగా.. ఐదుగురు ఎంపీల ప్రమాణం చేయనందున బలం 227కి పడిపోయింది. ఏడుగురు ఎంపీల ప్రమాణం పెండింగ్లో ఉన్నందున సభలో సభ్యలు సంఖ్య 536. దీంతో స్పీకర్ పదవికి మ్యాజిక్ ఫిగర్ 269 అవసరవుతాయి. ఎన్డీయేకు సంఖ్యాబలం దీనికంటే ఎక్కువే ఉంది. కాబట్టి ఓం బిర్లా విజయం నల్లేరుపై నడకే. అటు, వైఎస్ఆర్సీపీ నలుగురు ఎంపీల కూడా ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నారు. సభకు హాజరైన సభ్యులపైనే మెజార్టీ ఆధారపడి ఉంటుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ తన ఎంపీలకు విప్ జారీచేసింది. ప్రతి ఒక్కళ్లూ సభకు హాజరుకావాలని స్పష్టం చేసింది.
ఇక, కాంగ్రెస్ నుంచి స్పీకర్ పదవికి నామినేషన్ వేసిన ఎంపీ సురేశ్ మాట్లాడుతూ.. ఎన్నికలో గెలుపోటములు ముఖ్యం కాదని అన్నారు. సంప్రదాయాన్ని గుర్తు చేయడానికేనని ఇండియా కూటమి అభ్యర్థిగా తాను బరిలో ఉన్నట్టు స్పష్టం చేశారు. 2014,2019 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా లేదని డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వలేదని, ఇప్పుడు ఆ హోదా వచ్చాక ఇవ్వకపోవడమేమిటని ఆయన ప్రశ్నించారు.
ఇక, గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ సోదరుడైన అఫ్జల్ అన్సారీకి ఓ కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. అయితే, దీనిపై అలహాబాద్ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసు జులైలో విచారణ జరగనుండగా.. ఒకవేళ కింద కోర్టు తీర్పును హైకోర్టు సమర్దిస్తే ఆయన సభ్యత్వం రద్దవుతుంది.