దేశ రాజకీయాల్లో నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ బద్ధ రాజకీయ ప్రత్యర్థులు. ఏ అంశంపైన గానీ వీరిద్దరూ తరచూ ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటారు. కాంగ్రెస్ పార్టీ విధానాలపై ప్రధాని మోదీ విమర్శలు చేస్తే.. బీజేపీ తీసుకునే నిర్ణయాలపై రాహుల్ గాంధీ నిత్యం వాటిపై చురకలు అంటిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా లోక్సభలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. మంగళవారం లోక్సభలో స్పీకర్ ఎన్నిక జరగ్గా.. మరోసారి లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను సభలో నుంచి స్పీకర్ పోడియం వద్దకు తీసుకువెళ్తుండగా ఈ బ్యూటిఫుల్ మూమెంట్ జరిగింది.
లోక్సభ స్పీకర్గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన రాహుల్ గాంధీ.. ఓం బిర్లాకు అభినందనలు తెలిపారు. తమ సీట్లలో నుంచి లేచి వచ్చి ఓం బిర్లా వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఓం బిర్లా వద్దకు వచ్చి అభినందనలు చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చిన రాహుల్ గాంధీ.. అక్కడే ఉన్న నరేంద్ర మోదీకి కూడా కరచాలనం చేశారు. అనంతరం.. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ముగ్గురూ కలిసి ఓం బిర్లాను స్పీకర్ చైర్ వద్దకు తీసుకెళ్లారు.
ఓం బిర్లా మరోసారి లోక్సభ స్పీకర్గా ఎన్నికైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. అంతేకాకుండా రాబోయే 5 ఏళ్లలో ఓం బిర్లా మార్గనిర్దేశంలో ముందుకెళ్తామని తెలిపారు. ఇక ప్రతిపక్షాలు, ఇండియా కూటమి తరఫున ఓం బిర్లాను రాహుల్ గాంధీ అభినందించారు. ప్రజల గొంతుకకు ఓం బిర్లానే మధ్యవర్తి అని.. ప్రభుత్వానికి రాజకీయ అధికారం ఉండొచ్చు కానీ ప్రతిపక్షాలు కూడా ప్రజల గొంతును వినిపిస్తాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను సభలో మాట్లాడేందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతిస్తారనే నమ్మకం తనకు రాహుల్ గాంధీ తెలిపారు.
ఇక పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రావడంతో లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే గాంధీ కుటుంబం నుంచి ప్రతిపక్ష నేతగా ఎన్నికైన మూడో నేతగా రాహుల్ గాంధీ నిలిచారు. తండ్రి రాజీవ్ గాంధీ, తల్లి సోనియా గాంధీల తర్వాత గాంధీల కుటుంబం నుంచి లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన వ్యక్తిగా ఘనత సాధించారు.