ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోర్టులోనే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ.. సుప్రీంకోర్టులో పిటిషన్ వెనక్కి!

national |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2024, 10:27 PM

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో మనీల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా, ఇదే కేసులో కేజ్రీవాల్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసింది. ఆయన అరెస్ట్‌కు కోర్టు బుధవారం అనుమతించడంతో రౌస్ అవెన్యూ కోర్టులోనే సీబీఐ అదుపులోకి తీసుకుంది. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన అధికారులు.. కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.


ఇదే కేసులో ట్రయల్ కోర్టు గత గురువారం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేయగా.. దీనిపై ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. దిగువ న్యాయస్థానం తమ వాదనలకు తగినంత సమయం ఇవ్వలేదని ఆరోపించింది. దీంతో ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు బెయిల్‌ అమలును నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది. ఈడీ సమర్పించిన ఆధారాలను ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమైందని, బెయిల్‌ మంజూరులో నిర్ణయం తీసుకునేటప్పుడు సమగ్ర పరిశీలన చేయలేదని ఆక్షేపించింది.


ఈ నేపథ్యంలో హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో కేజ్రీవాల్‌ పిటిషన్ వేశారు. అయితే, హైకోర్టు నిర్ణయం వెలువడిన తర్వాతే.. దీనిపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు వెలువడటంతో బుధవారం దీనిపై విచారణ చేపట్టింది. అయితే, ఈ పిటిషన్‌ను తాజాగా కేజ్రీవాల్ తరఫున లాయర్లు వెనక్కి తీసుకున్నారు. పిటిషన్ ఉపసంహరించుకుంటామని కేజ్రీవాల్ కోరగా.. అందుకు అత్యున్నత జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎన్వీఎన్ భట్టిల ద్విసభ్య ధర్మాసనం అనుమతించింది. హైకోర్టు పూర్తిస్థాయి ఉత్తర్వులు, సీబీఐ అరెస్టు వంటి పరిణామాల నేపథ్యంలో సమగ్ర పిటిషన్‌ను దాఖలు చేస్తామని కేజ్రీవాల్ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ న్యాయస్థానానికి తెలిపారు.


అయితే, కేజ్రీవాల్ అరెస్ట్‌కు సీబీఐకి కోర్టు అనుమతివ్వడంపై ఆయన తరఫున లాయర్లు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇది అత్యంత పక్షపాతంతో కూడిన చర్యగా అభివర్ణించారు. ఇప్పటికే కేజ్రీవాల్‌ను 9 గంటల పాటు ఏప్రిల్‌లో సీబీఐ ప్రశ్నించిందని ఆయన తరఫు లాయర్ విక్రమ్ చౌదరి అన్నారు. ‘ఈ కేసు ఆగస్టు 2022 నుంచి పెండింగ్‌లో ఉంది.. నన్ను సాక్షిగా పిలిచారు... నేను హాజరయ్యాను.. తొమ్మిది గంటల పాటు విచారణ జరిగింది.. అప్పటి నుంచి ఒక్క నోటీసు కూడా (సీబీఐ నుంచి) రాలేదు. సాక్షి నుంచి నిందితుడిగా ఎలా మారారు...అది చాలా దారుణం’ అని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com