ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిప్యూటీ సీఎం పవన్ వీడియోతో పెద్ద కుట్ర.. టీడీపీకి సంబంధం లేదు, క్లారిటీ ఇదేనట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 25, 2024, 08:26 PM

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలన మొదలైంది.. గతవారం అసెంబ్లీ సమావేశాలు జరగ్గా.. మంత్రులు, ఎమ్మెల్యేలు గతవారం అసెంబ్లీలో ప్రమాణాలు చేశారు. అయితే సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఓ ప్రచారం జరుగుతోంది. ఆయన ఫోటోను ట్వీట్ చేస్తూ.. అసెంబ్లీలో నిద్రపోతున్నారంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. అయితే యువగళం పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది.. అయితే ఆ ఛానల్‌లో కూడా పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వీడియోలు చేశారు. అయితే ఈ యూట్యూబ్ ఛానల్‌కు టీడీపీకి లింక్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది.


ఈ క్రమంలో టీడీపీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించింది. ‘జగన్ రెడ్డి పడేసే డబ్బుల కోసం నడుపుతున్న పేజీలు, ఛానెల్స్ ఇవి. "Yuvagalam" అనే youtube ఛానల్, టీడీపీకి అనుకూలం అనే విధంగా ఐప్యాక్ వాళ్లతో మొదలు పెట్టించారు. గతంలో చంద్రబాబు గారిని తిడుతూ ఈ చానెల్‌లో వీడియోలు పెట్టారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ గారిపై ఫేక్ వీడియోలు వేసి, అది టీడీపీ వేసింది అనే విధంగా, జనసేనకి అనుకూలం అనే విధంగా మరో ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసారు. రెండు పార్టీల మధ్య అపోహలు సృష్టించడానికి, ఒక పెద్ద కుట్రకు తెర తీసారు’ అంటూ మండిపడ్డారు.


‘ "Yuvagalam" అనే Youtube ఛానల్‌తో టీడీపీకి ఎలాంటి సంబంధం లేదు. ఎన్నికల ముందు వరకు, ఈ ఛానెల్‌లో టిడిపికి వ్యతిరేకంగా వీడియోలు పెట్టారు. ఇలా పార్టీల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, సినిమా ఫాన్స్ మధ్య కుట్రలు చేసే నీచపు బుద్ధి, ఈ దేశంలో జగన్ రెడ్డి ఒక్కడికే ఉంది. దయచేసి ఇలాంటి ఫేక్ వార్తలని నమ్మవద్దని, మనవి చేస్తున్నాము. ఇలాంటి వాటిపై త్వరలోనే చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రం నుంచి సైకోగాళ్ళని శాశ్వతంగా తరిమేసే దాకా, టీడీపీ-జనసేన మైత్రి కొనసాగుతూనే ఉంటుంది’ అంటూ ట్వీట్ చేశారు.


సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. సరిగ్గా పవన్ కళ్లు మూసిన సమయంలో స్క్రీన్ షాట్ తీసి అసెంబ్లీలో పడుకుంటున్నారు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని జనసైనికులు మండిపడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ఇదంతా ప్రచారం చేస్తుందని.. ప్రజలు తిరస్కరించినా వారి బుద్ధి మారలేదంటూ మండిపడుతున్నారు. అసలు నిజం ఏంటో తెలుసుకోండి అంటూ వీడియోను ట్వీట్ చేశారు.


అసెంబ్లీ రెండో రోజు అయ్యన్నపాత్రుడు స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయ్యన్న మాట్లాడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ కంటి రెప్పలు మూసి మళ్లీ తెరిచారని.. ఈ గ్యాప్‌లోనే ఫోటో తీసి నిద్రపోతున్నట్లుగా ప్రచారం జరుగుతోందంటున్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దంటున్నారు. అయితే ఇప్పుడు టీడీపీకి లింక్ చేస్తూ జనసేన పార్టీతో మైత్రిని చెడగొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com