ట్రెండింగ్
Epaper    English    தமிழ்

55కు చేరిన తమిళనాడు కల్తీసారా మృతులు.. చావుబతుకుల్లో మరో 88 మంది

national |  Suryaa Desk  | Published : Sat, Jun 22, 2024, 10:28 PM

తమిళనాడులో కల్తీసారా మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం మృతుల సంఖ్య 55కు చేరుకోగా.. మరో 88 మంది ఆస్పత్రుల్లో చావుబతుకుల్లో ఉన్నారు. కళ్లకుర్చి కల్తీసారా బాధితుల్లో 17 మందిని పుదుచ్చేరి జిప్మర్‌ ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందజేస్తున్నారు. కళ్లకుర్చిలో కల్తీసారా తాగి 168 మంది ఆస్పత్రిలో చేరినట్టు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియం తెలిపారు. ఆస్పత్రికి వచ్చేందుకు వెనుకాడిన 55 మందిని కూడా బలవంతంగా తీసుకొచ్చినట్టు ఆయన చెప్పారు. చికిత్సకు వెనుకాడటమే మృతుల సంఖ్య పెరగడానికి కారణమని ఆయన పేర్కొన్నారు.


ముగ్గురు మహిళలు సహా 55 మంది ఇప్పటివరకు చనిపోయారు. ఈ ఘటనలో ఓ ముగ్గురు పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయారు. దీంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారయ్యింది. ఈ ముగ్గురు పిల్లలను ఎలా పోషించాలో తనకు అర్ధం కావడం లేదని వారి నాయినమ్మ కన్నీటిపర్యంతమవుతోంది. కుమారుడ్ని కోల్పోయిన ఓ మహిళ మాట్లాడుతూ.. ‘నా కొడుకు తీవ్రమైన కడుపునొప్పితో విలవిలలాడిపోయి.. కళ్లు కూడా తెరవలేకపోయాడు.. సారా తాగినట్టు నాతో చెప్పాడు.. ఆస్పత్రికి తీసుకెళ్తే సారా తాగాడని చేర్చుకోడానికి వైద్యులు నిరాకరించారు.. మద్యం దుకాణాలను ప్రభుత్వం మూసివేయాలి’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.


‘నా కొడుకు విపరీతమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు. అతను చూడలేడు, వినలేడు. ఇలా ఎవరికీ జరగకూడదు. మద్యం అమ్మకాన్ని ఆపేయండి’ మరో తల్లి వాపోయింది. ఇలా ఎవర్ని కదిపినా కన్నీటి కథలే వినిపిస్తున్నాయి. కల్తీసారా బాధితుల్లో ఏకంగా 28 మంది ఒక్క కళ్లకురిచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోనే చనిపోయారు. మృతుల్లో సగానికిపైగా ఇక్కడి నుంచే ఉన్నారు. ఘటన జరిగిన తొలిరోజు బుధవారం 10 మంది ఇదే ఆసుపత్రిలో చనిపోగా.. రెండో రోజుకు ఈ సంఖ్య 23కి చేరిందని అధికారులు తెలిపారు. శుక్రవారం ఇదే ఆసుపత్రిలో మరో ఐదుగురు మృత్యువాతపడ్డారు.


వైద్య సౌకర్యాల కొరత వల్ల ఈస్థాయిలో మరణాలు సంభవించాయని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే, ప్రతిరోజూ పదుల సంఖ్యలో కల్తీసారా బాధితులు కళ్లకురిచ్చి ఆసుపత్రికి వస్తుండేవారు. కానీ, ఒక్కసారిగా సంఖ్య పెరగడం, వారందరికీ అత్యవసర చికిత్స అవసరం కావడంతో ఆసుపత్రి యంత్రాంగం తీవ్ర ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. ఇక, బాధితులు మిథనాల్‌ కలిపిన సారాయి తీసుకోవడం అవయవాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇలాంటి రోగులను కాపాడాలంటే శరీరం నుంచి విషాన్ని వెంటనే తీసి, అవసరమైన అత్యవసర వైద్యాన్ని, ఔషధాల్ని అందుబాటులో ఉంచాలి. కానీ, అక్కడ ఆస్పత్రిలో అలాంటి వసతులు లేవని ఆరోపణలు ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com