ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల లడ్డూ రేటుపై టీటీడీ కీలక ప్రకటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 22, 2024, 07:31 PM

సోషల్ మీడియా ఎలా తయారైందంటే.. ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. అయితే అందులో నిజాల సంగతి దేవుడెరుగు. ఇలాంటి అనుభవమే ఇప్పుడు ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడికి ఎదురైంది. తిరుమలకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో చివరకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డే స్వయంగా ఈ వార్తపై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇక వార్త సంగతికి వస్తే తిరుమల లడ్డూ ధర తగ్గించారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.లడ్డూ ధర రూ.50 నుంచి రూ.25కి తగ్గించారని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అలాగే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రూ.200 తగ్గించారంటూ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వార్తలపై టీటీడీ స్పందించింది.


శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, తిరుమల లడ్డూ ధరల్లో ఎటువంటి మార్పు లేదని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. టీటీడీ ధరలను సవరించిందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తమని స్పష్టం చేసింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం.. రూ. 50 లడ్డూ ధరల్లో ఎలాంటి మార్పు లేదని టీటీడీ తెలిపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు నమ్మవద్దని స్పష్టం చేసింది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం దళారులను నమ్మి మోసపోవద్దని సూచించింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అధిక ధరలకు పొందవచ్చని వాట్సప్ గ్రూపులలో ప్రచారం జరుగుతోందన్న టీటీడీ.. ఇదంతా అవాస్తమని తెలిపింది.


తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించిన టికెట్లను టీటీడీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని దేవస్థానం బోర్డు ప్రకటనలో తెలిపింది. టీటీడీ వెబ్ సైట్ కాకుండా.. వివిధ రాష్ట్రాల టూరిజం విభాగాలకు కొంతమేర టికెట్లు కేటాయిస్తామన్న టీటీడీ.. ఎవరికైనా టికెట్లు కావాలని అనుకుంటే సంబంధిత టూరిజం విభాగాల వెబ్‌సైట్లను కూడా సందర్శించాలని విజ్ఞప్తి సింది.


అయితే కొంతమంది దళారులు ఈ టూరిజం విభాగాల ద్వారా టికెట్లు ఇప్పిస్తామంటూ ఎక్కువ ధర వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చినట్లు టీటీడీ తెలిపింది. ఈ నేపథ్యంలో టూరిజం విభాగాల ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొనుగోలు చేయాలనుకునే భక్తులు.. నేరుగా అధికారిక వెబ్ సైట్ సందర్శించాలని సూచించింది. దళారుల మాటలు విని మోసపోవద్దని.. వారిపై విజిలెన్స్ విభాగం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com