ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చాటింగ్ చూసి విడాకులిచ్చిన భార్య.. యాపిల్ కంపెనీపై రూ.53 కోట్ల దావా వేసిన భర్త

international |  Suryaa Desk  | Published : Wed, Jun 19, 2024, 10:52 PM

యాపిల్ కంపెనీ కారణంగా ఆ జంట సంసారం పెటాకులు అయింది. యాపిల్ ఐమ్యాక్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లు తాను డిలీట్ చేసినా.. అవి అతని భార్య కంట పడ్డాయి. దీంతో ఆమె భర్త పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా చివరికి భర్తకు విడాకులు కూడా ఇచ్చేసింది. భర్తకు విడాకులు ఇచ్చేంత ఆ యాపిల్ ఐమ్యాక్‌లో ఏముందంటే.. తన భర్త రాసలీలకు సంబంధించిన మెసేజ్‌లు ఉన్నాయి. వేశ్యలతో తన భర్త చేసిన చాటింగ్‌కు సంబంధించిన మెసేజ్‌లను.. ఆయన ఎవరి కంట పడకుండా డిలీట్ చేశాడు. అయినా అవి తన భార్య చూడటంతో వారిద్దరికీ విడాకులు మంజూరు అయ్యాయి. భార్య తనకు విడాకులు ఇవ్వడం.. యాపిల్ కంపెనీ సెక్యూరిటీ లోపం కారణంగానే అని ఆరోపించిన ఆ వ్యక్తి ఏకంగా యాపిల్ కంపెనీపైనే దావా వేశాడు. తనకు జరిగిన నష్టానికి రూ.53 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు.


లండన్‌కు చెందిన ఓ బిజినెస్‌మెన్ తన ఐఫోన్‌లోని ఐ మెసేజ్ యాప్ నుంచి భార్యకు తెలియకుండా వేశ్యలతో చాట్ చేశాడు. ఫోన్‌లోనే రాసలీలలు సాగించాడు. ఇక ఆ వ్యవహారం బయటపడకుండా ఉండేందుకు మెసేజ్‌లన్నీ డిలీట్‌ చేశాడు. అయితే ఇదే యాపిల్‌ ఐడీని తన ఐమ్యాక్‌లోనూ ఉపయోగించాడు. దీంతో ఐఫోన్‌లో మెసేజ్‌లు డిలీట్ చేసినా ఐమ్యాక్‌లో మాత్రం అలాగే ఉండిపోయాయి. అతని ఖర్మ కొద్దీ ఆ మెసేజ్‌లను ఒక రోజు భార్య చూసేసింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భార్య.. భర్తతో గొడవపడింది. ఇక భర్తతో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధమై.. చివరికి విడాకులకు దరఖాస్తు చేసింది. కోర్టు విడాకులు మంజూరు చేయడంతో.. వారిద్దరూ విడిపోయారు.


అయితే తన కాపురం కూలిపోవడానికి కారణం యాపిల్ సంస్థ అని అనుమానించిన ఆ వ్యక్తి యాపిల్‌ కంపెనీపై దావా వేశాడు. ఫోన్‌లో మెసేజ్‌లు డిలీట్‌ చేసినపుడు అవి పూర్తిగా డిలీట్ అయిపోయాయనే అనుకుంటాం కదా అని ఆ వ్యక్తి తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. అంతేగానీ లింక్‌ చేసిన అన్ని డివైజ్‌లలో మెసేజ్‌లు ఉండిపోతాయనే విషయం యాపిల్‌ సంస్థ యూజర్లకు స్పష్టంగా చెప్పలేదని తెలిపాడు. ఒక్క డివైజ్‌లోనే మెసేజ్‌లు డిలీట్‌ అవుతాయని చెబితే యూజర్లు అలర్ట్ అవుతారు కదా అని వెల్లడించాడు. ఈ విషయాన్ని యాపిల్ కంపెనీ తమ యూజర్లకు చెప్పలేదని.. దీని కారణంగానే తాను డిలీట్‌ చేసిన మెసేజ్‌లను చూసి తన భార్య విడాకులు ఇచ్చిందని వాపోయాడు.


ఈ ఘటన వల్ల తాను 5 మిలియన్‌ పౌండ్లు అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ.53 కోట్లు నష్టపోయినట్లు చెప్పాడు. తన భార్య మెసేజ్‌లు చూడటం వల్లే విడాకులు ఇచ్చిందని పేర్కొన్న ఆ వ్యక్తి.. ఇందుకు గాను యాపిల్‌ సంస్థ తనకు రూ. 53 కోట్లు చెల్లించాలని కోర్టులో దావా వేశాడు. ఈ పిటిషన్‌ను కోర్టు త్వరలోనే విచారణ జరపనుంది. మరి తీర్పు ఏం ఇస్తుందో వేచి చూడాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com